ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితమైన ప్రజలు
ఉమ్మడి జిల్లాలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు
ఖమ్మంలో పరిశీలించిన సీపీ విష్ణు ఎస్ వారియర్స్
వైద్యసేవలకు ఇబ్బందులుండొద్దని మంత్రి అజయ్ ఆదేశం
లాక్డౌన్, కరోనా నియంత్రణపై ఖమ్మం కలెక్టర్ సమీక్ష
ఖమ్మం, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా విస్తృ తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. 10 గంటలకు వాణిజ్య కార్య కలాపాలను వ్యాపారులు ముగించారు. మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, వంటగ్యాస్ ఏజెన్సీలు వంటి అత్యవసర సర్వీసులు మాత్రం కొనసాగాయి. అన్ని రకాల దుకాణాలనూ నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. రోజువారీ నిత్యావసర వ స్తువుల కోసం ఉదయం 10 గంటలకు ముందే దుకాణాల నుంచి ప్రజలు కొనుగోలు చేశారు. కూరగాయలు, పండ్లు వంటి షాపులు రద్దీగా కనిపించాయి. సినిమా హాళ్లు, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్ను పూర్తిస్థాయిలో మూసివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లోని బస్సులు ఉదయం 10 గంటల తర్వాత బయటకురాలేదు. బుధవారం నుంచి లాక్ డౌన్ ఉంటుందని మంగళవారం మధ్యాహ్నమే ప్రకటన వెలు వడడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. బస్టాండ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఖమ్మంలో లాక్డౌన్ అమలు తీరును పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. నగరంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ సమయంలో బయటకు రావద్దని వాహనదారులకు సూచించారు.
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్డౌన్ ఉదయం 10 గంటల తర్వాత పూర్తిగా కొనసాగింది. కొత్తగూడెం పట్టణంలో సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి కొనసాగింది. కార్మికులు షిఫ్ట్ల వారీగా విధులకు హాజరయ్యారు. గుర్తింపు కార్డులు కలిగిన కార్మికులను, ఉద్యోగులను పోలీసులు విధులకు అనుమతించారు. అలాగే కేటీపీఎస్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగింది. ఉద్యోగులు, కార్మికులు యథావి ధిగా విధులకు వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీని విస్తృతం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత భద్రాచలంలోని రామాలయాన్ని అర్చకులు మూసివేశారు. అయితే స్వామివారికి జరగాల్సిన సేవలను అంతరంగికంగా నిర్వహించారు.
లాక్డౌన్ కారణంగా కొవిడ్ బాధితులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, వైద్యం సకాలంలో అందేలా చూడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డిలను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులకు తక్షణం స్పందించి వైద్యం అందించాలని సూచించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరు, కొవిడ్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్, రెమ్డెసివర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఆక్సీజన్ కొరతలేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్న ఆంధ్రా ప్రాంతం నుంచి ఉదయం 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించలేదు. లాక్డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకున్న వారు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ-పాస్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు అధికారులు సూచించారు.
అత్యవసర సేవలన్నీ యథాతథం..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైంది. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర సర్వీసులన్నీ యథాతథంగా కొనసాగాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు కొవిడ్ వైద్యం కోసం వచ్చే వారికి బెడ్లు, ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచారు. సింగరేణి వ్యాప్తంగా 25,870 మంది కార్మికులు, ఉద్యోగులకు గాను 17,122 మంది విధులకు హాజరయ్యారు. సారపాకలోని ఐటీసీ యథావిధిగా పనిచేసింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కూడా కొనసాగాయి. ఉపాధి హామీ పనులు అంతరాయం లేకుండా జరిగాయి.