రెండేండ్లుగా ప్రత్యేకాధికారి పాలనలో గ్రామం
కోర్టు కేసు ఉపసంహరణతో ఎన్నికల మార్గం సుగుమం
ఓటర్ల జాబితా రూపొందించడంలో అధికారుల నిమగ్నం
ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం
సిరిసిల్ల రూరల్, మార్చి 31: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు లైన్క్లియర్ అయింది. రేండేండ్లుగా గ్రామంలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతున్నది. 2019లో కోర్టు కేసుతో ఎన్నికలకు బ్రేక్ పడింది. సర్పంచ్ స్థానం రిజర్వేషన్ కేటాయింపులో, జనాభా లెక్కల విషయంలో గ్రామానికి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి ఎన్నిక వాయిదా పడగా, ఎంపీడీవో చికోటి మదన్మోహన్ ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. ఇటీవలే కోర్టులో కేసును ఉపసంహరించుకోగా, ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, ఓటరు జాబితా రూపొందించడంతో అధికారులు నిమగ్నమయ్యారు.
కేసు ఉపసంహరణతో లైన్క్లియర్
బద్దెనపల్లిలో 1,154 ఓటర్లు ఉన్నారు. గ్రామ పరిధిలో బాలికల గురుకుల, కళాశాల, పాఠశాల ఉన్నది. ఈ జనాభాను సైతం గ్రామ జనాభాలో చూపించడంతో కొందరు 2019లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో 2019లో ఎన్నిక నిలిచిపోయింది. కోర్టు ఆశ్రయించిన వారే ఇటీవలే కేసును ఉపసంహరించుకోవడంతో ఎన్నికకు మార్గం సుగుమమైంది. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో అధి కారులు ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. ఈ నెల 3న పంచాయతీలో ఓటరు జాబితాను వార్డుల వారీగా నోటీస్ బోర్టులో అంటించనున్నారు. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 12న తుది జాబితాను ప్రకటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సర్పంచ్, పలు వార్డులకు ఎన్నికలు
బద్దెనపల్లిలో సర్పంచ్ స్థానంతోపాటు పది వార్డుల ఎన్నికకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎస్సీ (మహిళ)కు రిజర్వ్ కాగా, వార్డులకు రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉన్నది. ఎన్నికల వ్యయాన్ని సకాలంలో అప్పగించని వార్డు సభ్యులను అనర్హులుగా గుర్తించారు. పలువురు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. దీంతో వార్డుల స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. తంగళ్లపల్లిలో 9 వార్డు, అంకుసాపూర్లో 9వ వార్డు, గండిలచ్చపేటలో 1 వ వార్డు, లక్ష్మీపూర్లో 4 వార్డు, నేరెళ్లలో 3, 4 వార్డులు, రాళ్లపేటలో 4, 8 వార్డులు, వేణుగోపాలపూర్లో 4వ వార్డు, మల్లాపూర్లోలో 1 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ రావడంతో ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.