ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 495 పడకలు
కామారెడ్డిలో 180.. నిజామాబాద్లో 315 ఖాళీలు
అవసరమైతే క్వారంటైన్ కేంద్రాలుగా మోడల్
స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలు : నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
అందుబాటులో2,200 పడకలు
ఉమ్మడి జిల్లాలో ఒక్క రోజే 1208 కరోనా కేసులు
ఇందూరు, ఏప్రిల్ 23 : కరోనా ఉధృతి నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 495 పడకలు ఖాళీగా ఉన్నాయి. అవసరమైతే గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలను ఉపయోగించుకుంటామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. పాఠశాలల్లో మరో 2,200 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎప్పుడు అవసరమైనా వినియోగించుకునేలా అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశామన్నారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను కొవిడ్ వైద్య సేవలకు అనుగుణంగా మార్చుకున్నామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అదే విధంగా డివిజన్ స్థాయిలో మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలను సైతం క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకుంటున్నామని వివరించారు.
అవసరాన్ని బట్టి మిగతా భవనాలను సైతం ఇందుకోసం వినియోగించుకుంటామన్నారు. జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 2,200 పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అవసరమైన సదుపాయాలు సిద్ధం చేసుకొని వాటిని ఎప్పుడు అవసరమైనా కొవిడ్ చికిత్సల కోసం ఉపయోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు సైతం జారీ చేశామని తెలిపారు. డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీని ఉపయోగించుకోవడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయంపై కలెక్టర్ పైవిధంగా స్పందించారు. అందుబాటులో ఉన్న పైన తెలిపిన భవనాలను ఉపయోగించుకున్న తర్వాత కూడా ఇంకా అవసరమైతే క్రిస్టియన్ మెడికల్ కాలేజీని కూడా ఉపయోగించుకోవడానికి కూడా జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా ఆలోచిస్తుందని ఆయన వివరణ ఇచ్చారు. కొవిడ్ విషయంలో సలహాలు అవసరమైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08462-220183 నంబర్ను కానీ డివిజన్ స్థాయిలో అయితే నిజామాబాద్ డివిజన్ 8309219718, బోధన్ డివిజన్ 08467-222001, ఆర్మూర్ డివిజన్లో 08463-295050 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.