రామగిరి, జూన్ 8 : కరోనా నేపథ్యంలో 2020-21 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో ఇంటి నుంచే అడ్మిషన్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకుల, ప్రైవేట్ కాలేజీల్లో చేరవచ్చు. అడ్మిషన్లకు వచ్చే నెల 5 వరకు గడువు ఉంది.
నల్లగొండలో 128, సూర్యాపేటలో 78
నల్లగొండ జిల్లాలో 128 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 12 ప్రభుత్వ, 58 కేజీబీవీ, ఆదర్శ, గురుకుల, 58 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 3,750 అడ్మిషన్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 74 జూనియర్ కళాశాలలకుగాను ప్రభుత్వ 7, మోడల్, కేజీబీవీ, గురుకుల 22, ప్రైవేట్ 45 ఉన్నాయి. అన్ని కళాశాలల్లో ప్రభుత్వం కల్పించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అడ్మిషన్ ఇలా చేసుకోవాలి..
tsbie.cgg.gov.in వెబ్సైట్లో తొలుత తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ తర్వాత జిల్లా పేరుతోపాటు ఆ జిల్లాలో కళాశాలల వివరాలు వస్తాయి. విద్యార్థి తనకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాలి.
ఏ కళాశాలలో చేరాలని అనుకుంటారో ఆ కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల వాట్సాప్ నంబర్కు విద్యార్థి తన సర్టిఫికెట్స్, ఫొటో, ఫోన్ నంబర్, ఇతర వివరాలను పంపాలి.
ఆ తర్వాత ఆ కళాశాల ప్రిన్సిపాల్ వాటిని పరిశీలించి విద్యార్థికి అడ్మిషన్ నంబర్, ఇతర అంశాలను తిరిగి విద్యార్థి వాట్సాప్కు పంపిస్తారు. దీంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు.
మంచి అవకాశం
కరోనా సమయంలో అడ్మిషన్ల కోసం బయటికి వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తమ నచ్చిన కళాశాలల్లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి చేరవచ్చు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది నుంచి ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్నాం. కార్పొరేట్కు దీటుగా ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పలు పోటీ పరీక్షలకు నిపుణులైన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం.
-దస్రూ , డీఐఈఓ, నల్లగొండ