సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : కరోనా పంజా విసురుతున్నది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా లాక్డౌన్ విధించింది. 20 గంటలపాటు ఇంట్లో నుంచి బయటకెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఇప్పుడు అందరినోట వినిపిస్తున్న మాట. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి తోడు విజ్ఞానాన్ని ఎంచక్కా పెంచుకోవచ్చు. వయస్సు ఆధారంగా వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి మేడపైన లేదా ఇంటి ఆవరణలో వాకింగ్ చేయొచ్చు. యోగాసనాలతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కావాల్సిన పుస్తకాలు, నవలలు, పొడుపు కథలు, నీతి కథలు పుస్తకాలు చదివి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. నచ్చిన ఆహార పదార్థాలు చేసుకొని ఆస్వాదించొచ్చు. లాక్డౌన్ సమయంలో గడప దాటకుండా ఎలా గడపాలో తెలుసుకుందాం..
ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అనే బదులు నచ్చిన పుస్తకాలు చదవచ్చు. పుస్తకాలు అందుబాటులో లేకుంటే ఇంటర్నెట్లో కావాల్సిన పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. గూగుల్లో తెలుగు బుక్స్, ఓల్డ్ తెలుగు బుక్స్, ఫిలాసఫీ బుక్స్, అలాగే లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ తెలుగు బుక్స్ ఆన్లైన్ పేర్లతోపాటు అన్ని భాషల పుస్తకాలను ఆన్లైన్లో చదవడం లేదా పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని బోర్ అనిపించినప్పుడల్లా చదవచ్చు.
శరీరాన్ని, మనసును ఏకాగ్రతలో ఉంచే ఆయుధం యోగా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా చేయడం ఎంతో శ్రేయస్కరం. మానసిక ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. కొవిడ్ బాధితులతోపాటు సాధారణ పౌరులు ఉదయం, సాయంత్రం ఆసనాలు వేయడం మంచిది. ఐసోలేషన్లో ఉన్నవాళ్లతోపాటు వారి కుటుంబ సభ్యులు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా యోగా చేయడం వలన రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
మంచి ఆరోగ్యానికి నడకను మించింది లేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటి డాబాపై లేదా ఇంటి ఆవరణలో వాకింగ్ చేయడం వల్ల కాలక్షేపంతోపాటు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. రోజూ నడవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్గా ఉండటంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు. కుంగుబాటుకు లోనైనప్పుడు వ్యాయామం చేయడం, ఇంటి పనుల్లో భాగస్వామ్యం కావడం, కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడుతుండాలి.
ప్రస్తుతం ఎవరి పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబం కోసం భవిష్యత్లో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లయితే..పునర్జన్మలా భావించి
ముందున్న భవిష్యత్ గురించి ప్రణాళిక రూపొందించుకోవాలి.
లాక్డౌన్తో చాలామంది అనేక రకాల ఆటలు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అవుట్డోర్ ఆటలు తగ్గించి సాధ్యమైనంత వరకు ఇండోర్ ఆటలను కుటుంబసభ్యులతో కలిసి ఆడటమే మేలు. క్యారంబోర్డు, చెస్, అష్టాచెమ్మా, పచీసు వంటి వాటిని ఆడుకోవచ్చు. అవుట్డోర్ ఆటలను కేవలం తెలిసిన వ్యక్తులతో కలిసి దూరంగా ఉంటూ ఆడుకోవడం చాలా మంచిది.
సంగీతానికి మించిన ఆనందం లేదు. మంచి సంగీతం లేదా పాటలు వింటే ఎంత ఒత్తిడి ఉన్నా మాయమవుతుంది. ఇంట్లో ఉండి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా నెట్టింట్లోకి వెళ్లి మంచి పాటలను వినడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగి హోం ఐసోలేషన్లో ఉన్నవారు చక్కటి పాటలు వినడం వల్ల కొవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు.
లాక్డౌన్ సమయంలో రోజుకు 20 గంటలపాటు ఇంట్లోనే ఉండాల్సి రావడంతో కుటుంబానికి చాలా దగ్గరవుతారు. ఉదయం, సాయంత్రం ఇంటి గార్డెనింగ్ పనులు, ఇంటి పనుల్లో సహాయం చేయాలి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా మారుతారు. ప్రస్తుతం దొరికిన సమయంలో ఎక్కువగా కుటుంబంతో గడిపేందుకు వెచ్చించాలి.-డా.విజయభాస్కర్, రవి మీలియోస్ దవాఖాన
లాక్డౌన్ వల్ల ఇంట్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. అనవసర విషయాలు చర్చించి ఆందోళనకు లోను కాకుండా ఇండోర్ ఆటలు ఆడటం, పాటలు వినడం, వ్యాయామం చేయడం ఎంతో మేలు. కుటుంబంతో ఆనందంగా గడపడం వల్ల అన్ని బాధలు మరిచిపోతాం. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషమే సగం బలం.డా.రామకృష్ణ, జనరల్ ఫిజీషియన్, వెడలాస్ మెడికల్ విజన్ హెల్త్కేర్ సర్వీసెస్