బెంగళూర్ : రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుకున్నట్లు తెలిపారు.
మే 24 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండగా నిపుణుల సూచనల మేరకు పొడిగించినట్లు సీఎం మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 10 గంటల తరువాత కూడా కొంతమంది బయట తిరుగుతూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలి’ అని పోలీసులను సీఎం యడియూరప్ప ఆదేశించారు.
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి ప్రభుత్వమే జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మే 10 నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు మినహాయింపు నిచ్చింది. అత్యవసర సర్వీసులతోపాటు వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారికి మినహాయింపు ఉంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 5.3 లక్షలకు చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.