కొనసాగుతున్న ఫీవర్ సర్వే
ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా
పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులు
నారాయణపేట రూరల్, మే 10 : మండలంలో ఇంటిం టా ఆరోగ్య సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. సింగారం, అప్పిరెడ్డిపల్లి, భైరంకొండ, శేర్నపల్లి, అప్పక్పల్లి, కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్తోపాటు వివిధ గ్రామాల్లో సోమవారం పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వివరాలు నమోదు చేశారు. అలాగే టీకాలు ఎవరెవరు వేసుకున్నారు.. ఎన్ని డోసులు తీసుకున్నారు.. తదితర వివరాలను సేకరించారు. సింగారంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ పద్మతో కలిసి ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేశారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, మే 10 : ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించారు. పులిమామిడిలో ఎంపీడీవో కాళప్ప పాల్గొని సర్వేను పరిశీలించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ, గ్రామ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉన్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, లక్షణాలు ఉన్న వా రికి ఇంటి వద్దకే మెడికల్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో ఉపాధి ఏపీవో ఎల్లయ్య, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మరికల్ మండలంలో..
మరికల్, మే 10 : కొవిడ్ రోగులను గుర్తించి తక్షణమే వైద్యం సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులకు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయా.. అని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు తెలుసుకుంటున్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటే మందుల కిట్లు పంపిణీ చేస్తున్నారు. లక్షణాలు ఎక్కువగా ఉంటే దవాఖానలకు వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనాపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
పరిశీలించిన ప్రత్యేకాధికారి
కోస్గి, మే 10 : ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టారు. సోమవారం ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయా.. అని అడిగి తెలుసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వివరాలను సిబ్బంది సేకరించారు. లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్ అందజేశారు. తీవ్రమైన లక్షణాలు ఉంటే దవాఖానలకు వెళ్లాలని సూచించారు. ఈ సర్వేను మండల ప్రత్యేకాధికారి కృష్ణమాచారి పరిశీలించారు. సర్వేలో ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టాలి
నర్వ, మే 10 : కరోనా కేసులు పెరుగకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి శివప్రసాద్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని యాంకి, జక్కన్నపల్లి, నర్వ తదితర గ్రామాల్లో ఇంటింటికీ సర్వేలో భాగంగా జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రత్యేక్షంగా కలిసి సంబంధిత సిబ్బంది అందజేస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. బాధితులకు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎవరైనా ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్కుమార్, కార్యదర్శి శ్యాంసుందర్రెడ్డి, ఆయా గ్రామాల ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.