న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని సర్ గంగారామ్ దవాఖానలో అసాధారణ సంఘటన చోటు చేసుకున్నది. పుట్టుకతో నోరు తెరువకుండా ఉన్న ఓ మహిళకు సర్జరీ నిర్వహించిన వైద్యులు.. 30 ఏండ్ల తర్వాత ఆమె నోరు తెరిచేలా చేయగలిగారు. దీనిని పలువురు వైద్యులు వైద్య అద్భుతంగా పేర్కొంటున్నారు. తనకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని సదరు మహిళ చెమ్మగిల్లిన కళ్లతో చెప్తున్నది.
ఢిల్లీకి చెందిన మహిళ ఆస్తా మోంగియా.. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆస్తా పుట్టుకతో వచ్చే రుగ్మతతో బాధపడుతూ నెల రోజుల క్రితం సర్ గంగారామ్ దవాఖానలో చేరింది. ఈ మహిళ ఈ సమస్యతో గత 30 ఏండ్లుగా బాధపడుతున్నది.
దవడ ఎముక నోరు రెండు వైపుల నుంచి ముందుకు వెళ్లి పుర్రె ఎముకతో అతుక్కుపోయాయి. ఈ కారణంగా ఆమె ఎప్పుడూ నోరు తెరవలేదు. కేవలం ద్రవాలపై మాత్రమే జీవించి ఉన్నది. నోటిలో ఓపెనింగ్ పాసేజ్ లేకపోవడంతో ఆమె నోటిలోని దంతాలన్నీ క్రమంగా క్షీణించే దశకు చేరుకున్నాయి. రోగి పరిస్థితి కీలకమైనదిగా భావించిన సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా లేదు.
ఇంతకుముందు భారతదేశంతోపాటు దుబాయ్, యునైటెడ్ కింగ్డమ్లోని ప్రముఖ దవాఖానల్లోని వైద్యులను సంప్రదించారు. చివరగా ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జరీ విభాగం సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజీవ్ అహుజా ఈ కేసును తీసుకోవడానికి అంగీకరించారు.
డాక్టర్ రామన్ శర్మ, డాక్టర్ ఇతిశ్రీ గుప్తా (ప్లాస్టిక్ సర్జరీ), డాక్టర్ అంబరేష్ సాత్విక్ (వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ), డాక్టర్ జయశ్రీ సూద్, డాక్టర్ అమితాబ్ (అనస్థీషియా) బృందానికి డాక్టర్ రాజీవ్ అహుజా నాయకత్వం వహించారు. శస్త్రచికిత్స చేసేందుకు సన్నాహాలు మూడు వారాల ముందు ప్రారంభమయ్యాయి.
రక్తంతో నిండిన సిరలను కొద్దిగా కుదించడానికి రోగి ముఖానికి ప్రత్యేక ఇంజెక్షన్ వేశారు. చివరికు 2021 మార్చి 20 న ఆపరేషన్ జరిగింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆస్తా నోరును 2.5 సెంటీమీటర్ల మేర తెరుచుకునేట్లు చేయగలిగారు.
శస్త్రచికిత్స తర్వాత ఐదు రోజులకు ఆస్తాను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఫిజియోథెరపీ చేయడం ద్వారా 3 సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలిగిందని, ఇలాగే నోటి వ్యాయామం చేయడం ద్వారా మరింత తెరుచుకుంటుందని డాక్టర్ రాజీవ్ అహుజా తెలిపారు.
‘మా అమ్మాయి గత 30 ఏండ్లుగా నోరు తెరువలేక చాలా బాధపడింది. నాలుకను చేతితో కూడా తాకలేదు. ఈ రోజు డాక్టర్ల పుణ్యమా అని నోరు తెరిచింది. అలాగే తన నాలుకను చేతితో తాకుతున్నది’ అని ఆస్తా తండ్రి హేమంత్ పుష్కర్ మొంగియా సంతోషంతో చెప్పారు.
‘జన్మనిచ్చిన దేవుడికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ఆస్తా మొంగియా కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు.
నందిగ్రామ్లో అమిత్షా భారీ రోడ్షో
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్పిన్ లాలా
బంగ్లాదేశ్లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..