పోలీసులంటే దండించేవారు కాదు దయాగుణం కలిగినవారని మరోసారి నిరూపించారు మదనాపురం పోలీసులు. వనపర్తి జిల్లా మదనాపురం మండలకేంద్రానికి చెందిన శకుంతల (80)కు ఎవరూ లేరు. చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించేది. చుట్టుపక్కలవారే రోజూ ఇంటికి వెళ్లి భోజనం అందించేవాళ్లు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల శుక్రవారం మృతిచెందింది. కరోనా వేళ అటుపక్క వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు. వృద్ధురాలికి దూరపు చుట్టమైన లక్ష్మి బాధపడుతుండగా.. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై తిరుపాజి ఆపత్కాలంలో మేమున్నామంటూ స్పందించారు. సిబ్బందితో కలిసి పాడె మోసి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటుకున్నారు.