కొలంబో: తొలి మ్యాచ్కు పూర్తి భిన్నంగా సాగిన రెండో వన్డేలో.. యువ భారత్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైన చోట.. తీవ్ర ఒత్తిడిలో అద్భుత పోరాటం కనబర్చింది. ఫలితంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది. దీపక్ చాహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (53) అర్ధశతకాలు సాధించగా.. కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 276 పరుగుల లక్ష్యఛేదనలో 116 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఈ ముగ్గురు గట్టెక్కించారు. విజయానికి 84 పరుగులు అవసరమైన దశలో క్రీజులో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ లేకున్నా.. భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్) అండతో దీపక్ అద్భుతం చేశాడు. ఫలితంగా మరో 5 బంతులు మిగిలుండగానే భారత జట్టు విజయ తీరాలకు చేరింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. చరిత అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. చమిక కరుణరత్నె (44 నాటౌట్), భానుక (36), ధనంజయ (32) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, చాహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో అసమాన పోరాటం కనబర్చిన దీపక్ చాహర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.
గత మ్యాచ్లో అదరగొట్టిన పృథ్వీ షా (13), ఇషాన్ కిషన్ (1) విఫలమవగా.. కెప్టెన్ ధావన్ (29), మనీశ్ పాండే (37) ఓ మాదిరిగా ఆడారు. హార్దిక్ పాండ్యా (0) ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. లంక బౌలర్లు ఒత్తిడి పెంచడంతో ఒక దశలో భారత్ 116/5తో నిలిచింది. ఈ దశలో సూర్యకుమార్, కృనాల్ పాండ్యా కాస్త పోరాడి జట్టును నిలబెట్టగా.. ఆఖర్లో దీపక్ చాహర్ విశ్వరూపం కనబర్చాడు. మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం లభించకున్నా పట్టువదలకుండా పోరాడాడు. అచ్చమైన బ్యాట్స్మన్లా ఆరంభంలో ఆచితూచి ఆడిన అతడు.. క్రీజులో కుదురుకున్నాక సందకన్ ఓవర్లో సిక్సర్ బాదాడు. ఆ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు అరుసుకోవడంతో లక్ష్యం 36 బంతుల్లో 35 పరుగులకు చేరింది. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధశతకం పూర్తి చేసుకున్న దీపక్.. బౌండ్రీతో మ్యాచ్ను ముగించడం విశేషం.
శ్రీలంక: 275/9 (చరిత అసలంక 65, అవిష్క 50; భువనేశ్వర్ 3/54, చాహల్ 3/50), భారత్: 277/7 (దీపక్ 69 నాటౌట్, సూర్యకుమార్ 53, హసరంగ 3/37).