నాటింగ్హామ్: వరుణుడి దోబూచులాట మధ్య సాగిన తొలి టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం లభించినా.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (2/15) విజృంభించడంతో భారత టాపార్డర్ తడబడింది. ఫలితంగా రెండో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57 నాటౌట్) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (36) ఫర్వాలేదనిపించాడు. ముగ్గురు మొనగాళ్లు విరాట్ కోహ్లీ (0), పుజారా (4), రహానే (5) ఘోరంగా విఫలమయ్యారు. వర్షం కారణంగా గురువారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రాహుల్తో పాటు పంత్ (7) క్రీజులో ఉన్నాడు.
కోహ్లీ గోల్డెన్ డక్
ఓవర్నైట్ స్కోరు 21/0తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ఆడుతూ పాడుతూ పరుగులు జోడించింది. రోహిత్, రాహుల్ నింపాదిగా ఆడటంతో మొదటి సెషన్లో టీమ్ఇండియాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి వికెట్కు 97 పరుగులు జోడించాక భారీ షాట్కు యత్నించిన రోహిత్ క్యాచ్ ఔట్ కాగా.. రెండో సెషన్లో స్వింగ్తో చెలరేగిన అండర్సన్.. పుజారా, కోహ్లీలను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. విరాట్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరగడం గమనార్హం. రహానే రనౌట్ కావడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారీ వర్షం ముంచెత్తగా.. పలు సమీక్షల అనంతరం అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183, భారత్ తొలి ఇన్నింగ్స్: 125/4
(రాహుల్ 57 నాటౌట్, రోహిత్ 36; అండర్సన్ 2/15).