దశాబ్దాల చైనా ఆధిపత్యానికి గండికొడుతూ బ్యాడ్మింటన్కు భారత్ కేరాఫ్ అడ్రస్గా మారిన వైనం. బ్యాడ్మింటన్ అంటే హైదరాబాద్ అడ్డా అనేలా ఠక్కున గుర్తుకు వచ్చే సందర్భం. కొన్ని గంటల వ్యవధిలో మొదలుకానున్న టోక్యో ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు భారీ ఆశలతో బరిలోకి దిగుతున్నారు. తెలుగు యువ షట్లర్లు ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి.. పతకాలే లక్ష్యంగా పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో మన రాకెట్లు మెరిస్తే.. భారత్ పంట పండినట్లే.
–నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
బ్యాడ్మింటన్లో భారత్ రాకెట్ వేగంతో దూసుకెళుతున్నది. అంచనాలకు మించి రాణిస్తూ మనోళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో మెరుస్తున్నారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తాచాటుతున్నారు. సరిగ్గా ఐదేండ్ల క్రితం రియోలో జరిగిన విశ్వక్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు రజత పతకంతో మెరిసింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం గెలిచిన తొలి భారత ప్లేయర్గా సింధు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్తో జరిగిన పసిడి పతకపోరులో కొదమ సింహలా కొట్లాడింది. అదే స్ఫూర్తి, అంతకుమించిన ఆత్మవిశ్వాసంతో సింధు..టోక్యో ఒలింపిక్స్ సిద్ధమైంది. స్వర్ణ సాధనే ఏకైక లక్ష్యంగా టోక్యోలో అడుగుపెట్టింది. ఈనెల 25న జరిగే సింగిల్స్ తొలి పోరులో ఇజ్రాయిల్కు చెందిన పొలికర్పోవా సెనియాతో తలపడనుంది. గ్రూపు దశలో రెండు మ్యాచ్లు గెలిస్తే..నాకౌట్కు అవకాశం లభిస్తుంది. గాయం కారణంగా మారిన్ దూరం కావడం సింధుకు కలిసి రానుంది. కానీ చెన్ యుఫీ, నవోమి ఒకుహర, తైజు యింగ్, అకానే యమగుచి, ఇటానోన్ రూపంలో సింధుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ప్రిక్వార్టర్స్లో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫెడ్, క్వార్టర్స్లో యమగుచితో సింధు తలపడే చాన్స్ ఉంది. కరోనా విజృంభణతో ఓవైపు టోర్నీలు నిలిచిపోయినా.. పార్క్టై సంగ్ శిక్షణలో సింధు మరింత రాటుదేలింది. ఫిట్నెస్ విషయంలో మరో మెట్టు ఎదిగిన సింధు..ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేస్తానన్న ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నది.
పురుషుల సింగిల్స్ విషయానికొస్తే..ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య విజేత సాయి ప్రణీత్, డబుల్స్ స్పెషలిస్టు సాత్విక్సాయిరాజ్పై అంచనాలు మెండుగానే ఉన్నాయి. లీగ్ దశలో ప్రణీత్కు అంతగా పోటీ లేకపోయిన నాకౌట్కు వచ్చేసరికి కఠిన ప్రత్యర్థులు ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్లో పదో ర్యాంక్లో కొనసాగుతున్న సాత్విక్, చిరాగ్శెట్టి జోడీకి తొలి పోరులోనే టాప్సీడ్ ఇండోనేషియా ద్వయం ఎదురవుతున్నది. గత కొన్ని టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న ఈ జోడీకి ప్రత్యర్థుల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.
మహిళల సింగిల్స్ పీవీ సింధు
పురుషుల సింగిల్స్ సాయి ప్రణీత్
పురుషుల డబుల్స్ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి
సైనా నెహ్వాల్ (కాంస్యం) లండన్(2012)
పీవీ సింధు (రజతం) రియో(2016)