మకాయ్: మహిళల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న మిథాలీరాజ్ (61) వన్డేల్లో వరుసగా ఐదో అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో మిథాలీ బృందం 9 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీతో పాటు యషిక భాటియా (35), రిచా ఘోష్ (32 నాటౌట్), జులన్ గోస్వామి (20) ఫర్వాలేదనిపించారు. వన్డే క్రికెట్లో వరుసగా ఐదో అర్ధశతకాన్ని తన పేరిట రాసుకున్న మిథాలీ.. మూడు ఫార్మాట్లలో కలిపి ఓవరాల్గా 20 వేల కెరీర్ పరుగుల మైలురాయిని దాటింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్ 41 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది. హైన్స్ (93 నాటౌట్), హీలీ (77), లానింగ్ (53 నాటౌట్) హాఫ్సెంచరీలు చేశారు. ఆసీస్కు వన్డేల్లో ఇది వరుసగా 25వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో భారత్ తరఫున రిచా ఘోష్, యషిక భాటియా, మాన్సి సింగ్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేయగా.. ఆస్ట్రేలియా తరఫున హన్నా డార్లింగ్టోన్ తొలి మ్యాచ్ ఆడింది. బ్రౌన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగనుంది.
భారత మహిళలు: 225/8 (మిథాలీ రాజ్ 63, యషిక 35; బ్రౌన్ 4/33),
ఆస్ట్రేలియా మహిళలు: 41 ఓవర్లలో 227/1 (హైన్స్ 93 నాటౌట్, హీలీ 77; పూనమ్ 1/58).