క్రీడాలోకమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ను వరుణుడు వణికిస్తున్నాడు. అగ్రశ్రేణి జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమనుకుంటే.. సౌతాంప్టన్లో భారత్, న్యూజిలాండ్తో వర్షం దోబూచులాడుతున్నది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తరహాలో ఆగి ఆగి సాగుతున్న తుదిపోరులో తొలి రోజు ఇరు జట్లు సమఉజ్జీలుగానిలిచాయి. 64 ఓవర్లు ఆడిన కోహ్లీసేన 146 పరుగులు చేస్తే.. స్వింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై కివీస్ పేసర్లు మూడు వికెట్లు పడగొట్టారు. మరి ఆదివారమైన వరుణుడు తెరిపినిచ్చి ఆటను సజావుగా సాగనిస్తాడా చూడాలి!
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను వర్షం వదిలేలా లేదు. ఇప్పటికే తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజూ వరుణుడు మ్యాచ్కు పలుమార్లు అంతరాయం కలిగించాడు. మేఘావృతమైన వాతావరణంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్) రాణించగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (34) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం కోహ్లీతో పాటు అజింక్యా రహానే (29) క్రీజులో ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, జెమీసన్, వాగ్నర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
పచ్చిక పిచ్పై టాస్ గెలిచిన మరుక్షణమే న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి వికెట్కు 62 పరుగులు జోడించాక రోహిత్ ఔట్ కాగా.. గిల్ (28) అతడిని అనుసరించాడు. ఖా తా తెరిచేందుకు 36 బంతులు తీసుకున్న పుజారా (8) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ దశలో కోహ్లీకి రహానే జతకలిశాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. టీ విరామం అనంతరం వెలుతురు సరిగ్గాలేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ మృతికి సంతాపంగా శనివారం టీమ్ఇండియా ఆటగాళ్ల చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌథీ (బి) జెమీసన్ 34, గిల్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 28, పుజారా (ఎల్బీ) బౌల్ట్ 8, కోహ్లీ (నాటౌట్) 44, రహానే (నాటౌట్) 29, ఎక్స్ట్రాలు: 3, మొత్తం: 146/3. వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88, బౌలింగ్: సౌథీ 17-4-47-0, బౌల్ట్ 12.4-2-32-1, జెమీసన్ 14-9-14-1, గ్రాండ్హోమ్ 11-6-23-0, వాగ్నర్ 10-3-28-1.