వరుణుడి దెబ్బతో ‘డ్రా’కావడం పక్కా అనుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్.. ఇరు జట్ల హోరాహోరీ పోరుతో రసకందాయంలో పడింది. షమీ, ఇషాంత్ స్వింగ్కు తలవంచిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తొలి ఇన్నింగ్స్లో కీలక ఆధిక్యం మూటగట్టుకుంటే.. రెండో ఇన్నింగ్స్లో మరింత బాధ్యతాయుతంగా ఆడిన టీమ్ఇండియా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మిగిలిన ఒక్క రోజు ఆటలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయా.. లేక ‘డ్రా’గా ముగిసి ఇరు జట్లు విజేతలుగా నిలుస్తాయో నేడు తేలనుంది!
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వరుణుడు విరోధిలా నిలిచినా.. భారత్, న్యూజిలాండ్ మాత్రం శక్తి వంచనలేకుండా పోరాడుతున్నాయి. భారీ వర్షం కారణంగా ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులు తుడిచిపెట్టుకుపోగా.. మంగళవారం వరుణుడు శాంతించడంతో మ్యాచ్ సజావుగా సాగింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (177 బంతుల్లో 49) పట్టుదలతో నిలువగా.. సౌథీ (30) వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. 32 పరుగుల కీలక ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4, ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా మంగళవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 64 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న కోహ్లీ సేన..32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చతేశ్వర్ పుజారా (12), విరాట్ కోహ్లీ (8) క్రీజులో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల ఆట ముగియగా.. నేడు రిజర్వ్డేలో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది.
మంచి ఎండ కాస్తున్న సమయంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్ (30), గిల్ (8) శుభారంభాన్నివ్వలేకపోయారు. పది ఓవర్ల పాటు ఓపికగా నిలిచిన గిల్.. సౌథీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అక్కడి నుంచి నయావాల్ చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత భుజానెత్తుకున్నాడు. ఆడిన తొలి బంతికే పరుగు తీసిన పుజారా.. రోహిత్తో కలిసి కివీస్ బౌలర్లను విసిగించాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత సౌథీ వేసిన చక్కటి ఇన్స్వింగర్కు రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సారథి కోహ్లీ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
ఓవర్నైట్ స్కోరు 101/2తో మంగళవారం ఐదో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్.. వర్షం అంతరాయం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన తొలి సెషనల్లోనే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్కు టేలర్ (11) పెవిలియన్ చేరగా.. నికోల్స్ (7)ను ఇషాంత్ డగౌట్ బాట పట్టించాడు. వాట్లింగ్ (1) అతడిని అనుసరిం చాడు. లంచ్ అనంతరం కొత్తబంతితో విజృంభించిన షమీ.. గ్రాండ్హోమ్ (13), కైల్ జెమీసన్ (21)లను ఔట్ చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ ఒంట రి పోరాటం కొనసాగించగా .. ఆఖర్లో సౌథీ (30) ధాటిగా ఆడి న్యూజిలాండ్కు కీలక ఆధిక్యం అందించాడు. అశ్విన్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 217, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లీ (బి) అశ్విన్ 30, కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54, విలియమ్సన్ (సి) కోహ్లీ (బి) ఇషాంత్ 49, టేలర్ (సి) గిల్ (బి) షమీ 11, నికోల్స్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 7, వాట్లింగ్ (బి) షమీ 1, గ్రాండ్హోమ్ (ఎల్బీ) షమీ 13, జెమీసన్ (సి) బుమ్రా (బి) షమీ 21, సౌథీ (బి) జడేజా 30, వాగ్నర్ (సి) రహానే (బి) అశ్విన్ 0, బౌల్ట్ (నాటౌట్) 7, ఎక్స్ట్రాలు: 26, మొత్తం: 249. వికెట్ల పతనం: 1-70, 2-101, 3-117, 4-134, 5-135, 6-162, 7-192, 8-221, 9-234, 10-249, బౌలింగ్: ఇషాంత్ 25-9-48-3, బుమ్రా 26-9-57-0, షమీ 26-8-76-4, అశ్విన్ 15-5-28-2, జడేజా 7.2-2-20-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) సౌథీ 30, గిల్ (ఎల్బీ) సౌథీ 8, పుజారా (నాటౌట్) 12, కోహ్లీ (నాటౌట్) 8, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 64/2. వికెట్ల పతనం: 1-24, 2-51, బౌలింగ్: సౌథీ 9-3-17-2, బౌల్ట్ 8-1-20-0, జెమీసన్ 10-4-15-0, వాగ్నర్ 3-0-8-0.