అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. ‘రెండేళ్లుగా జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బాబు ముఠాకు బుద్ధి రాలేదు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. పారిపోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని అబద్దాల యంత్రాల్లా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. పైశాచికానందం పొందడం మినహా ఏం సాధిస్తారు?’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
’14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణను పట్టించుకోలేదు. అప్పుడే ముందు చూపు కనబర్చి ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం తేలికయ్యేది. వైద్యం ప్రభుత్వ బాధ్యతే కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు గురివింద నీతులు చెబుతున్నాడని’ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.