చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం చెపాక్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 6 పరుగుల తేడాతో ఓడించింది. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. సీజన్లో హైదరాబాద్కు ఇది వరుసగా రెండో ఓటమి. కీలక సమయాల్లో రెచ్చిపోయిన బెంగళూరు బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్నందించారు.
కెప్టెన్ డేవిడ్ వార్నర్(54: 37 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్), మనీశ్ పాండే(38: 39 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) పోరాటం వృథా అయింది. వీరిద్దరు ఔటైన తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా బెంగళూరు చేతిలోకి వెళ్లింది. షాబాజ్ అహ్మద్(3/7) సంచలన ప్రదర్శన చేసి హైదరాబాద్ను దెబ్బకొట్టాడు. హర్షల్ పటేల్(2/25), మహ్మద్ సిరాజ్(2/25) గొప్పగా బౌలింగ్ చేశారు.
అంతకుముందు గ్లెన్ మాక్స్వెల్(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్వెల్ అర్ధశతకానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్(11), శాబాజ్ అహ్మద్(14), ఏబీ డివిలియర్స్(1), వాషింగ్టన్ సుందర్(8) తీవ్రంగా నిరాశపరిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.