
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెస్ ధోనీ.. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడో వన్డేలోనూ 87 పరుగులతో నాటౌట్గా నిలిచిన మహి.. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్గా ధోనీ నిలిచాడు. అంతకుముందు సచిన్, కోహ్లి, రోహిత్శర్మ ఆస్ట్రేలియాలో ఈ మార్క్ అందుకున్నారు. మూడో వన్డేకు ముందు ఈ ఘనత అందుకోవడానికి ఎమ్మెస్ 36 పరుగుల దూరంలో ఉన్నాడు. చేజింగ్లో రెండో వికెట్ పడగానే క్రీజులోకి వచ్చిన ధోనీ.. రికార్డు అందుకోవడంతోపాటు టీమ్నూ గెలిపించాడు. అంతకుముందు అడిలైడ్లో జరిగిన రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ చేసిన ధోనీ.. టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. సిరీస్లో మూడు వన్డేల్లోనూ అతడు హాఫ్ సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. సిరీస్లో మొత్తం 193 పరుగులు చేశాడు. ఒకే మ్యాచ్లో ఔట్ కాగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో అజేయంగా నిలిచాడు. దీంతో అతని సగటు 193గా ఉంది.