
లండన్: ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా దారుణంగా ఓడిన తర్వాత టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్.. కోచ్ రవిశాస్త్రినే బాధ్యుడిని చేస్తూ విమర్శలు చేసిన విషయం గుర్తుంది కదా. తాజాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోచ్నే తప్పుబట్టాడు. టీమ్ ఓటమికి రవిశాస్త్రితోపాటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్నే బాధ్యులను చేయాలని అతను స్పష్టంచేశాడు. టీమ్ ఫలితాలకు సంబంధించి కోచ్ రవిశాస్త్రి బాధ్యుడు. ఇక టీమ్లో ఒక్క బ్యాట్స్మన్ తప్ప మిగతా అందరూ విఫలమవుతున్నారంటే దానికి సంజయ్ బంగార్ బాధ్యత వహించాలి. ముందు ఈ ప్రశ్నలకు బదులు చెబితేగానీ.. ఆ మూడు దేశాల్లో సిరీస్లు గెలవడం టీమిండియాకు అసాధ్యం అని గంగూలీ అన్నాడు.
నాలుగో టెస్టులో 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మ్యాచ్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాటింగ్ క్రమంగా వెనుకడుగు వేస్తున్నదని దాదా చెప్పాడు. చాలా రోజులుగా ఈ బ్యాటింగ్ లైనప్ పరుగులు చేయడం లేదు. 2011 నుంచి విదేశీ పర్యటనల్లో టీమ్ ప్రదర్శన చూస్తే.. ప్రతి పెద్ద సిరీస్లోనూ ఓడిపోయారు. విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంతవరకు ఓ బౌలర్ బౌలింగ్ చేస్తున్నట్లు, మిగతా బ్యాట్స్మెన్ క్రీజులో ఉంటే మరో బౌలర్ బౌలింగ్ చేస్తున్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రస్తుత టీమ్లో బ్యాట్స్మెన్లో బ్యాటింగ్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది అని గంగూలీ స్పష్టంచేశాడు.