సిద్దిపేట : దివ్యాంగులను చిన్నచూపు చూడటం తప్పని వాళ్లను అవమానిస్తే కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవసరమైన, విలువైన ఉపకరణాలను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో 516 మంది లబ్ధిదారులకు రూ. 80 లక్షల విలువ గల ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి సాయం చేసేందుకు బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వికలాంగులకు చేయూతనివ్వాలన్నారు.
దరఖాస్తు చేసుకున్న వికలాంగులందంరికి ప్రభుత్వం ఉపకరణాలను అందిస్తుందన్నారు. వికలాంగులకు దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా ఒక్కొక్కరికి రూ. 3,016 చొప్పున పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట పట్టణ ప్రగతి నివేదిక ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెబుతున్నదన్నారు. అభివృద్ధికి మారుపేరు సిద్దిపేట నిలుస్తుందన్నారు. ప్రజల అవసరాలే ఎజెండాగా అభివృద్ది పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అధికారుల సహకారంతో సిద్దిపేటను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేయనున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. అనంతరం లబ్దిదారులతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనం చేశారు.