సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, తిప్పారం, ముద్దాపూర్ గ్రామాల్లో గురువారం పల్లె ప్రగతిలో భాగంగా నాలుగవ విడత కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుకునూరుపల్లి గ్రామంలో జరిగిన సభలో హరీశ్రావు పాల్గొని మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ గ్రామాలన్నీ దైన్యస్థితిలో మారి నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యం చేయబడ్డాయన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పల్లెలు ముళ్ల పొదలతో, చెత్త చెదారంతో, గతుకుల రోడ్లతో కంపు కొట్టుకుపోయాయన్నారు. ఆనాటి సమైక్య పాలనలో పొలాలన్నీ ఎండిపోయాయని కరెంటు సమస్యతో ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయి కరెంటు మోటార్లు కాలిపోయేవని నాటి దుస్థితులను వివరించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో గుంట ఎండిపోకుండా ఏనాడు కూడా పంట సరిగ్గా పండలేదని పేర్కొన్నారు.
బ్యాంకులలో పంట రుణాలకు రైతులు పడిగాపులు కాసేవారని, తాగునీటి కోసం నానా ఇక్కట్లు పడేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల స్వరూపాలు మారిపోయాయని వివరించారు. పల్లెలన్నీ, పట్టణాలుగా తీర్చిదిద్దబడ్డాయని, ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ అభివృద్ధి కోసం నెల నెలా నిధులు విడుదల చేసి స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. డంపు యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించి పట్టణాలకు ధీటుగా తయారు అవుతున్నాయని, సేంద్రీయ ఎరువులు తయారు చేసి మొక్కలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలతో గ్రామాలన్నీ పురోభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మండుటెండల్లో సైతం చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని మంత్రి వివరించారు. రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టును పూర్తి చేసుకుని హల్దీ వాగు ద్వారా అన్నీ ప్రాంతాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు.
రైతుల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రతి ఏటా రెండు దఫాలుగా సాయాన్ని అందించే పథకాన్ని రైతుబంధును తీసుకు వచ్చారన్నారు. ప్రస్తుత వానాకాలం పంట సాయం కింద రూ. 7300 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో వేసినట్టు తెలిపారు. కాళేశ్వరం ద్వారా అన్నీ గ్రామాలకు నీళ్లు చేరడంతో ఈ సారి పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. ఈయేడు 4 లక్షల 93 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోళ్లు చేసిందని చెప్పారు. రైతుల బాగోగులు చర్చించుకునేందు కోసం క్లస్టర్లుగా విభజించి రైతు వేదికలను నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు.
హరితహారంతో పల్లెల్లో పచ్చని తివాచీలు పరుచుకున్నాయన్నారు. రాజీవ్ రహదారి వెంట ఇరువైపులా మూడు రకాల మూడు వరుసల మొక్కల పెంపకంతో హరిత గోడ ఏర్పడిందన్నారు. చెట్ల పెంపకంతో ఆరోగ్యంతో పాటు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందన్నారు. చెట్లు నాటడం వాటి ఆవశ్యకతను సవివరంగా మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఏంపీపీ ర్యాగల సుగుణ-దుర్గయ్య, జెడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు దేవి రవీందర్, కుకునూరుపల్లి సర్పంచ్ పొల్కంపల్లి జయంతి నరేందర్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.