సిద్దిపేట అర్బన్ : తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామ్రెడ్డి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజేందర్రెడ్డి, అనంతరెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగా 2022లో రూపొందించే తుది ఓటరు జాబితాను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఆదేశించారు. ఓటరు జాబితాను పరిశీలించి మరణించిన వారి పేర్లను, ఇతర గ్రామాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఇతర కారణాలతో తొలగించే ముందు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి పేర్లను తొలగించి జాబితాలు సిద్ధం చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ పరిధిలో ఓటర్ జాబితాలను క్రమబద్ధీకరించాలన్నారు.
తప్పిదాలు లేకుండా ..
ప్రత్యేక ఓటరు నమోదు, పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి తప్పిదాలు లేకుండా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా కొత్తగా ఓటరు నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాల మార్పులు, చేర్పులు సంబంధించిన పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా రూపొందించాలన్నారు. ఓటరు జాబితా తయారీ కార్యక్రమానికి ముందస్తుగా ఆగస్టు 09 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రి రివిజన్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందని, నవంబర్ 30 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి రెండు శనివారాలు, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 20 వ తేదీ లోగా అభ్యంతరాలను ఓటర్ క్లెయిమ్స్ను పూర్తి స్థాయిలో పరిష్కరించి జనవరి 05 2022న తుది ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 01, 2022ను ప్రామాణికంగా తీసుకొని అప్పటికీ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిపూర్ణమైన ఓటరు జాబితా సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు సంబంధించి ఫారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు వివరించారు.