సిద్దిపేట : సిద్దిపేట ముఖాన్ని మార్చి పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన పార్టీకే ప్రజలు ఓటేయాల్సిందిగా మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారన్నారు.
కొమటిచెరువును అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దడం, అనేక ప్రదేశాల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం, పాదచారుల కోసం రోడ్ల వెంట ఫుట్పాత్ల నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కలిగిన అతికొద్ది పట్టణాల్లో సిద్దిపేట ఒకటన్నారు. రాష్ట్రంలోనే వ్యర్థాల నిర్వహణలో తొలిస్థానంలో ఉందన్నారు. గత ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఎంపీ కోరారు.