బైక్ను ఢీకొట్టిన బొలేరొ .. ఓ పాఠశాల నిర్వాహకుడి మృతి
తొగుట/మిర్దొడ్డి : చిన్నారులూ…మీకు పుస్తకాలు తీసుకు రావడానికి సిద్దిపేటకు వెళ్తున్నా.. అంటూ పాఠశాల నుంచి విద్యార్థులతో నవ్వుకుంటూ ద్విచక్రవాహనంపై వెళ్లిన పాఠశాల నిర్వాహకుడిని బొలేరొ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిర్దొడ్డి ఎస్ఐ శ్రీనివాస్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్దొడ్డి మండల కేంద్రానికి చెందిన సాన నాగరాజు (40) గత ఐదేండ్లుగా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం చిన్నారులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను సిద్దిపేట నుంచి తీసుకురావడానికి దొమ్మాట నుంచి తన బైక్పై ( ఏపీ 23 ఎన్ 1571)వెళ్లాడు. అక్కడి నుంచి దొమ్మాటకు తిరిగి వస్తుండగా తొగుట మండలంలోని గుడికందుల మెయిన్ రోడ్లో ఎదురుగా తొగుట వైపు వెళ్తున్న బొలేరొ వాహనం బైక్ను ఢీకొట్టగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. పుస్తకాలు చెల్లాచెదురుగా పడ్డారు. నాగరాజు మృతదేహాన్ని, ఆ బైక్ను బొలేరొ వాహనంలోనే మిర్దొడ్డి మీదుగా దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మిర్దొడ్డి ఠాణా ఎదుట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. బొలేరొ వాహన డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని బైఠాయించారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ హరికృష్ణగౌడ్, ఎస్ఐలు శ్రీనివాస్, సర్ధార్ జమాల్ ఆందోళన కారులకు సర్ధిచెప్పారు. సదరు కాంట్రాక్టర్ హామీతో వారు ఆందోళన విరమించారు. పోలీసులు మృతదేహాన్ని దుబ్బాకలోని ఏరియా దవాఖానకు తరలించారు. నాగరాజు మరణవార్త విన్న దొమ్మాటలోని ప్రైవేట్ పాఠశాలలో విద్య సభ్యసిస్తున్న చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు, మిర్దొడ్డి గ్రామస్తులు విషాదానికి లోనయ్యారు. మృతుడికి భార్య రజిత, కుమార్తెలు సమీక్ష (8), ప్రణిత (6)లున్నారు.