సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల భవనాలను ఆయన ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకొని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆర్థ్ధిక శాఖ మంత్రి హరీశ్రావు రెండు మూడు రోజులుగా సిద్దిపేటలోనే ఉంటూ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలకడానికి టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
–సిద్దిపేట, జూన్ 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సిద్దిపేట కలెక్టరేట్
శనివారం సమీకృత కలెక్టరేట్ సముదాయం ప్రారంభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మతో కలిసి మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు సిద్దిపేట జిల్లా లో పర్యటించనున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని తెలిపారు. మొదట 11 గంటలకు సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అనంతరం సిద్దిపేట శివారులో పోలీసు కమిషనరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం, సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవ అనంతరం కార్యాలయంలో మీటింగ్హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఏడేండ్లలో చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికి దశ, దిశా చూసేలా అన్ని కొత్త జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అధునాతన సాంకేతికతతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు కొత్త డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో అభివృద్ధి చిహ్నాలుగా కొత్త ప్రభుత్వ కార్యాలయాలు నిలుస్తాయన్నారు. సిద్దిపేట ప్రాంత దశాబ్దాల జిల్లా ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటుతో మూడు జిల్లాలకు ప్రయోజనం కలిగిందన్నారు. ప్రజలకు దూరభారం తగ్గిందన్నారు.
తీరొక్క పూలు.. రంగురంగుల విద్యుత్ కాంతులు.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. అధునాతన సౌకర్యాలతో భవనాలు.. ఆహ్లాదభరితంగా పచ్చిక బయళ్లు.. ఇలా సకల హంగులతో రాష్ర్టానికే మోడల్గా సిద్దిపేట నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం ప్రారంభానికి సిద్ధ్దమైంది. నేడు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భవనానికి మొత్తం తీరొక్క పూలతో.. రంగురంగుల విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. కార్యాలయ ప్రాంగణంలో పచ్చదనం, గార్డెన్ ఆకట్టుకుంటున్నది. ప్రారంభోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి హరీశ్రావు చొరవతో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వివిధ శాఖల కార్యాలయాలు అన్నింటినీ ప్రారంభోత్సవానికి సిద్ధ్దం చేస్తున్నారు. అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న నూతన సమీకృత కలెక్టరేట్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారనున్నది.
ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని రాజీవ్ రహదారి పక్కన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, పోలీస్ కమిషనరేట్ భవనాలను ప్రారంభించి, సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సీఎం రాక కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాజీవ్ రహదారి వెంబడి టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీలను, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో అడుగడుగునా ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశారు.