సిద్దిపేట : రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత బస్టాండు సర్కిల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అగ్రవర్ణ పేదల మద్దతు ఉంటుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అరవింద్ రెడ్డి, నాయకులు ముక్కిస సత్యనారాయణ రెడ్డి, బుచ్చిరెడ్డి, సంపత్ రెడ్డి, మచ్చ వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.