కమలాయపల్లిని సందర్శించిన అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్
మద్దూరు, సెప్టెంబర్14: చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామాన్ని అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను సర్పంచ్ ఓరుగంటి అంజయ్య, గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
శిథిలావస్థకు చేరిన ఓవర్హెడ్ ట్యాంక్ను కూల్చి దాని స్థానంలో నూతన ఓవర్హెడ్ ట్యాంక్ను నిర్మించాలని అదనపు కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని, గ్రామంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా నూతనంగా మురుగు కాల్వలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వైకుంఠధామాన్ని పరిశీలించి స్నానాలకు కావాల్సిన నీటి కోసం బోరును వేయించాలని సర్పంచ్కు సూచించారు. ఈ పనులన్నింటినీ రెండు వారాల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి అమీనాబాను, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, ఎంపీవో సుధీర్కుమార్, ఎంఈవో నర్సింహారెడ్డి, ఎంపీటీసీ చెట్కూరి కల్యాణి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.