డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు..ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు
రాత్రివేళలో విద్యుత్ కాంతులు.. నిత్యం పారిశుధ్యపనులు
గ్రామంలో పచ్చదనం నిండిన హరితహారం చెట్లు
దుబ్బాక, మే 11 : ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలు సద్వినియోగించుకుంటూ పల్లెలుప్రగతి సాధిస్తున్నాయి. గతంలో పల్లెలంటే చిన్నచూపు చూసిన అధికారులు ..నేడు పల్లెల్లో అభివృద్ధి చూసి నివ్వరబోతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లిలో నాడు నిధుల లేమితో ఎన్నో ఇబ్బందులు పడ్డా ప్రజలు ..నేడు పల్లె ప్రగతితో సంబురపడుతున్నారు.
నాడు మారుమూల పల్లె అంటూ చిన్న చూపు..
దుబ్బాక మండలం గోసాన్పల్లి గ్రామం గతంలో అభివృద్ధికి ఆమాడదూరంగా ఉండేది. దుబ్బాక మండల కేంద్రానికి గోసాన్పల్లి 12 కి.మీ దూరంలో ఉండడంతో.. అభివృద్ధి నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా ‘గోసాన్పల్లి’ గోస తీరింది. ఇంటింటికీ నల్లానీరు ..ప్రతి గల్లీలో అద్దంలా సీసీ రోడ్లు.. గ్రామంలో అంతర్గత రోడ్ల పక్కన పచ్చని తోరణాల మాదిరిగా నాటిన మొక్కలు ..గ్రామ శివారులో నిర్మించిన పల్లె ప్రకృతివనం, డంప్యార్డు, వైకుంఠధామం, వన నర్సరీ , డబుల్ బెడ్రూం ఇండ్లు గోసాన్పల్లికి మరింత వన్నె తెచ్చాయి. గోసాన్పల్లిలో శిథిలావస్థకు చేరిన 32 ఇండ్లను కూల్చి వేశారు. రెండు పాత బావులను పూడ్చివేశారు. సమస్యాత్మకంగా ఉన్న కరెంట్ స్తంభాలను , విద్యుత్ వైర్లను తొలగించి, నూతనంగా మరో 20 స్తంబాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో, గ్రామం చుట్టూ మొత్తం 254 విద్యుత్ దీపాలతో వెలుగులు నింపారు. గ్రామంలో 441 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇందులో 12 మంది వికలాంగులకు, 178 మంది బీడీ కార్మికులు, 89 వృద్ధాప్య, 10 గీత కార్మికులు, 46 వితంతువులు, 6 ఒంటరి మహిళలకు పింఛన్లు వస్తున్నాయి. హరితహారంలో 5 వేల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారు. దీంతో పాటు గ్రామ శివారులో మరో 25 వేల మొక్కలకు పైగా నాటారు. గ్రామంలో 361 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిత్యం ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు..గ్రామంలో రెండు 40 వేల లీటర్ల ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించారు.
గ్రామస్తుల కృషితోనే..
మా ఊరులో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. చెత్తాచెదారం లేకుండా పంచాయతీ కార్మికులతో రోజు పని చేయిస్తున్నాం. ముఖ్యంగా పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.
గోసాన్పల్లి ఆదర్శంగా మారింది..
గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. ముఖ్యం గా ఇండ్లు లేని నిరుపేదలకు 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాం. పచ్చదనం, పరిశుభ్రతలో గోసాన్పల్లి ఆదర్శంగా నిలిచింది. సర్పం చ్, వార్డు సభ్యులు ప్రత్యేక దృష్టితో గ్రామంలో పల్లె ప్రగతి పనులు విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన 30 ఇండ్లతో పాటు 2 పాత బావులను తొలగించాం.