మునిపల్లి, జూన్ 14 : కరువు నేలగా పేరుబడిన సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పర్వే పనులకు ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మునిపల్లి మండలం లింగంపల్లిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు సోమవారం ప్రారంభం కావడంతో ఈ ప్రాంత రైతులు ఆనందంలో మునిగిపోయారు.
సీఎం కేసీఆర్ కృషితో తమ ప్రాంతానికి గోదావరి జలాలు రానున్నాయని, ఇక బంగారు పంటలు పండుతాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోదావరి జలాలు తమ ప్రాంతానికి వస్తాయని కలలో కూడా ఊహించలేదని, సీఎం కేసీఆర్ కృషితో త్వరలోనే తమ భూములను గోదావరి జలాలు తడుపుతాయన్నారు. సంగమేశ్వర సాక్షిగా అందోల్ అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
మన నీళ్లు మనకే..
మన నీళ్లు మనమే వినియోగించుకునేలా సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు. గత పాలకుల హయాంలో సింగూరు డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ తాగేందుకు గుక్కెడు నీరు తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. మన రాష్ట్రం.. మన ముఖ్యమంత్రి కావడంతో మన నీళ్లు మనమే వాడుకుంటూ పంటలు పండించుకునే అవకాశం వచ్చింది. ప్రతి రైతు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
రైతులకు పండుగే…
సింగూరు డ్యాం నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడం చాలా సంతోషంగా ఉంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించి రైతుల ఇళ్లలో సిరులు కురిపించే విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏ ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు, పథకాలు అమలు చేయలేదు.