సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట. ఈ మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ ఈ మట్టి బిడ్డనే. సిద్దిపేటను ఆర్థిక మంత్రి హరీశ్రావు తనదైన శైలిలో అభివృద్ధి చేసి, ఇవాళ రాష్ర్టానికే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు. సిద్దిపేట మున్సిపాలిటీ 1956లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 మంది చైర్మన్లు తమ పాలనను ప్రజలకు అందించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో పలు అభివృద్ధి పనులు చేయించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. సిద్దిపేట మానేరు పథకం స్ఫూర్తితోనే రాష్ట్రంలోనే ఇవాళ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రతి గడపకూ తాగునీరు ఇస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు పెద్దఎత్తున సిద్దిపేటకు నిధులు తెచ్చి, అభివృద్ధి చేశారు. పట్టణ ప్రజల ముందు అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం. మరో సారి చైర్మన్ స్థానాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకోనున్నది. రెండు పర్యాయాలు టీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నారు. ప్రస్తుతం మూడోసారి చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయం. మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపటితో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. కాగా, మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల వేయడానికి రెండు రోజులే గడువు ఉండడంతో మున్సిపల్ బరిలో నిలిచేందుకు నాయకులు పోటీలు పడుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పార్టీ టికెట్టు ఎవరికిస్తే వారికి అందరు కలిసికట్టుగా విజయానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ నుంచి ఒక్కో వార్డు నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య అధికంగానే ఉందని చెప్పాలి. ఇతర పార్టీల నాయకులు సైతం వారివారి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా..
సిద్దిపేట మున్సిపాలిటీ 1956లో ఏర్పడింది. అప్పటి నుంచి 2016 వరకు 10 మంది చైర్మన్లు తమ పాలన కొనసాగించారు. ఇందులో 1992 నుంచి 1995 వరకు, తిరిగి 2010 నుంచి 2016 వరకు ప్రత్యేక పాలన కొనసాగింది. సిద్దిపేట మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ప్రత్యేక ఎన్నికలు జరుగగా, మిగతా సమయాల్లో పరోక్ష పద్ధతిన చైర్మన్ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నిక 11వ చైర్మన్ది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43వార్డులున్నాయి. మొదటి మున్సిపల్ చైర్మన్గా ఖాజామోహినొద్దీన్(కమ్యూనిస్టు) 1956 నుంచి 1962 వరకు కొనసాగారు. వంగా మల్లారెడ్డి(కాంగ్రెస్) 1962 – 1967, సొప్పదండి రాజమల్లయ్య (స్వతంత్య్ర) 1967 – 1972, వెనిశెట్టి రాజమౌళి(కాంగ్రెస్) 1981 – 1983, కాపర్తి లింగం(కాంగ్రెస్) 1983 – 1984, వెనిశెట్టి రాజమౌళి(కాంగ్రెస్) 1984 – 1986, ఈ ఐదేండ్ల కాలంలో ఇద్దరు అధికారాన్ని పంచుకున్నారు. కాగా, సొప్పదండి హరిశ్చంద్ర(టీడీపీ) 1987 – 1992, బాసంగారి రమేశ్ (కాంగ్రెస్) 1995 – 2000, గట్టు అపర్ణ(టీడీపీ) 2000 – 2005, కడవేర్గు రాజనర్సు (టీఆర్ఎస్) 2005 నుంచి 2010 వరకు కొనసాగారు. సిద్దిపేట పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో కోర్టు స్టేతో ఎన్నికలు జరుగలేదు. తిరిగి 2016 ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరుగగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సిద్దిపేట పురపాలక సంఘం 10వ చైర్మన్ కడవేర్గు రాజనర్సు ఎన్నికయ్యారు. 2016 ఏప్రిల్ నుంచి ఐదేండ్ల పాటు పాలనను అందించారు. వీరి పదవి కాలం ఈ నెల 15న ముగిసింది. ప్రస్తుతం జరుగనున్న ఎన్నిక 11వ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.