రామాయంపేట, మే 21 : రోడ్లపై పంట నూర్పిళ్లు ప్రమాదాలను కొనితెస్తున్నాయి. యాసంగి, వానకాలం సీజన్లలో పంటలు చేతికి రాగానే రైతులు తమ ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టుకోవడమే పనిగా మారింది. ఎక్కడ చూసినా రైతులు రోడ్ల వెంట పంటల నూర్పిళ్లు వేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాలతో పాటు జిల్లాలోని రోడ్ల వెంట పంట నూర్పిళ్లు, ధాన్యం కుప్పలు కనిపిస్తాయి. రామాయంపేట నుంచి గజ్వేల్, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్ వెళ్లే దారిలో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. రైతులు ధాన్యాన్ని రోడ్డుకు ఒకవైపు ఆరబోస్తారు. రోడ్డు వెంట ఒక వాహనం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఇబ్బంది పడకతప్పదు. ధాన్యంలో నుంచి వెళ్తే వాహనం అదుపు తప్పుతుంది. నిజాంపేట మండలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశ్యంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రెండు మండలాల్లో తారురోడ్లన్నింటిని బీటీ రోడ్లుగా మార్చారు. అంతటితో బాగానే ఉన్నా ఆ రోడ్డు నిండా ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఈ విషయంలో రామాయంపేట, నిజాంపేట పోలీసులు కూడా ధాన్యం ఆరబోసిన వారికి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం నిజాంపేట మండల శివారులోని సిద్దిపేట వెళ్లే ప్రధాన రోడ్డులో నూర్పిళ్లు ఉండడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో వాహనదారుడికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. రోడ్లపై పంట నూర్పిళ్లు పోయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రమాదాలు తగ్గాయి
అక్కడక్కడ రోడ్లపై ధాన్యాన్ని రైతులు ఆరబోస్తున్నారు. దీం తో వాహనదారులు ప్రమాదాలబారిన పడ్తున్నారు. ప్రస్తుతం రెండు మండలాల్లో ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగడమే గాకుండా తమ సిబ్బంది పర్యవేక్షణలో పటిష్టమైన చర్యలు చేపడ్తున్నాం. ఏ గ్రామంలోనైనా ప్రజలు, వాహనదారులకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే తమకు నేరుగా సమాచారాన్ని అందివ్వాలని సూచిస్తున్నాం. – సీఐ.చంద్రశేఖర్రెడ్డి