సిద్దిపేట ప్రతినిధి, మే 17 (నమస్తే తెలంగాణ ): పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా పరిశుభ్రమైన, పచ్చని వాతావరణంలో పల్లెలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులివ్వడంతో గ్రామాలు ప్రగతి పథం పట్టాయి. ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులతో పాటు ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేయనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
మారిన రూపురేఖలు
నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా మారాయి. ఆరుబయట చెత్త కనిపించడం లేదు. శిథిల భవనాలు, పెంకుటిళ్లు తొలగించి పరిసరాలు శుభ్రంగా మార్చారు. శ్రమదానాలతో వీధులు, కాలనీలు బాగుపడ్డాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా ‘పవర్వీక్’ కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కరించారు. గ్రామాలు, పట్టణాల్లో వంగిన విద్యుత్ స్తంభాలు, లూజు వైర్లు సరిచేశారు. కొత్తగా మూడోలైన్ ఏర్పాటు చేశారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మహిళలు తడి, పొడి చెత్తను వేరుగా చెత్తబండ్లకు అందిస్తున్నారు. ఆ చెత్తను డంపింగ్ యార్డులకు పంపి, జీపీల ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని పంచాయతీ అవసరాలకు వినియోగిస్తున్నారు. చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటుగా ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు ఉపయోగించని వారికి, చెత్తను ఎవరైనా పబ్లిక్ స్థలాల్లో వేస్తున్న వారికి రూ.500 వరకు జరిమానా వేస్తున్నారు. గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏమిటో తెలియజేసి, గ్రామంలోని వారందరినీ భాగస్వాములను చేసి, గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకున్నారు.
నాలుగు విడతల్లో చేపట్టిన పనులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో అనేక పనులు నిర్వహించారు. నాలుగు విడతల్లో జిల్లాలోని 499 పంచాయతీల్లో 2,928 మురికి కాల్వల్లోని మట్టిని తొలగించి శుభ్రం చేశారు. 2,997 పాత ఇండ్లను కూల్చి, స్థలాలను చదును చేశారు. సర్కారు తుమ్మలు, ఇతరత్రా మొక్కల పొదలు 4,266, ఖాళీ స్థలాలు 3476, రోడ్లు, పాత్వేల్లో 2,317 ఫిల్ చేశారు. 1540 లోతట్టు ప్రాంతాలు, 1889 లో లెవల్ ప్రాంతాల్లో మొరం పోశారు. 831 చోట్ల కెనాల్స్, కాల్వల్లో మట్టిని తొలిగించారు. 916 అంగన్వాడీ సెంటర్లు, 499 ప్రైమరీ పాఠశాలలు, 143 అప్పర్ ప్రైమరీ, 224 ఉన్నత పాఠశాలలు, 209 దవాఖానలు, 771 కమ్యూనిటీ హాల్స్, 577 ఇతర భవనాలు, 157 మార్కెట్ స్థలాలు, 404 బస్టాండ్ల వద్ద శుభ్రపరిచారు. 1685 తాగునీరు స్థలాలు, 1685 మంచినీటి ట్యాంకుల వద్ద శుభ్రం చేశారు. 1,41,128 చోట్ల శ్రమదానం చేశారు. 13,27,797 మొక్కలను పంపిణీ చేసి నాటించారు. 7,08,943 మీటర్ల పొడవులో 3,84,050 అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. 456 పాడుబడిన బావులను పూడ్చారు. 200 ఓపెన్ బోరుబావులను మూసివేశారు. 1329 చోట్ల లూజ్ వైర్లను సరిచేశారు. 2,785 విద్యుత్ స్తంభాల మీదుగా 2,785 చోట్ల మూడో వైరును వేశారు. 1257 విద్యుత్ పోల్స్ బిగించారు. ఇలా పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో ఎన్నో పనులు చేపట్టారు.
ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి
జిల్లాలో ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదో విడతలో చేపట్టాల్సిన పనులపై గ్రామాల నుంచి నివేదికను తెప్పించుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లాస్థాయి అవగాహన సదస్సును నిర్వహించను న్నారు. ఐదో విడతలో ప్రధానంగా పారిశుధ్యం, రోడ్లపై గుంతలు పూడ్చడం, హరితహారం, రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపడుతారు.
రోజు వచ్చి చెత్తను తీసుకుపోతున్నారు
మా వార్డుకు రోజు ఉదయమే చెత్తబండి వస్తుంది. ఆ బండికి మేము తడి, పొడి చెత్తను రెండు డబ్బాల్లో వేసిన దాన్ని ఇస్తున్నాం. రోజు తప్పకుండా వచ్చి చెత్తను మున్సిపాలిటీ బండి వచ్చి తీసుకుపోతున్నది. వార్డును కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నరు.
– తాళ్లపాక శ్రీమతి, హుస్నాబాద్
కంటికి రెప్పలా మొక్కల సంరక్షణ
గ్రామంలోని నర్సరీలో మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నర్సరీని కోతులు ధ్వంసం చేయకుండా కంచెను ఏర్పాటు చేశాం. నర్సరీలో అనేక జాతుల పువ్వులు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నాం.