సిద్దిపేట, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఆదాయ, కుల, ఈబీ సీ, స్థానికత సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యుద్ధ ప్రాతిపదికన జారీచేయాలని తహసీల్దార్లకు ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన సర్టిఫికెట్ల జారీ, ధాన్యం కొనుగోళ్లు, ధరణి తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రా వు మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడినందున ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సర్టిఫికెట్లు జారీచేయాలన్నా రు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోపు ఆయా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సమయం వృథా కాకుండా చూడాలని, విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావద్దని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్గా సందర్శించి పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రైతులను చైతన్యపర్చాలని సూచించారు. రైస్మిల్లర్లు ఏ రోజుకారోజు ధాన్యం దింపుకొనే విధంగా చూడాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
‘ధరణి’లో సమస్యలు పరిష్కరించాలి..
ధరణి పోర్టల్లో కొత్త మాడ్యుల్స్ వచ్చాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. సర్వే నంబరు తప్పు, విస్తీర్ణం, భూమి రకాల్లో తప్పులు ఉన్నట్లయితే మీ-సేవలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భూయజమానులకు సూచించాలన్నారు. ధరణి సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్ హనుమంతరావు, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.