సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా కేంద్రం సిద్దిపేటలో చర్మ సంబంధ జబ్బుల పరీక్షలు, చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతను జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలు బలోపేతం అవుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి.అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. పేద రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నది. తెలంగాణ వచ్చాక సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ వైద్యం బలోపేతమవుతున్నది.