గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. పర్యాటకులకు మరింత గొప్పగా కొండపోచమ్మ రిజర్వాయర్ అందాలను చూపించడానికి ప్రాజెక్టు వద్ద వింగ్మాస్టర్స్ కంపెనీ పారామోటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారాంతంలో శని, ఆదివారాల్లో ప్రాజెక్టు చూడడానికి వచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతమంతా బాగా రద్దీగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నది.
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 10 : కొండపోచమ్మ రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో చూడడానికి ప్రాజెక్టు సమీపంలోనే పారామోటరింగ్ కేంద్రం ఏర్పాటైంది. ఈ పారామోటరింగ్ కేంద్రంలో 2 యంత్రాలు గాలిలో ఎగరడానికి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు ఒకరు, పైలట్తో పాటుగా ఎగరడానికి అవకాశం ఉంటుంది. సంస్థ నిర్వాహకులు అభయ్సింగ్ రాథోడ్ ఆరేండ్లుగా తాము ఈవెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. జైపూర్లో 2016లో ఇంగ్లాండ్, ఇటలీ ప్రాంతాల నుంచి యంత్రాలను, శిక్షకులను తీసుకువచ్చి తాము శిక్షణ తీసుకున్నామన్నారు. ప్రస్తుతం జైపూర్, విశాఖపట్నం, రుషికొండ బీచ్ల్లో వారు పారామోటరింగ్ కేంద్రాలను 20 యంత్రాలతో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకశాఖతో కలిసి పనిచేస్తూ పర్యాటలకులకు విహంగవీక్షణ అనువభవాన్ని కలిగించడానికి కృషి చేస్తున్నారు. తెలంగాణలో తొలిసారి కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద పారామోటరింగ్ కేంద్రంతో పాటు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నవంబర్ మొదటి వారం నుంచి ఇక్కడ గాలిలో పారామోటరింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 మిషన్లతో పారామోటరింగ్ కేంద్రాలను అభయ్సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో వింగ్ మాస్టర్స్ కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద ఉన్న 100 నుంచి 180కిలోల బరువు వరకు ఉన్న పర్యాటకులను ఆకాశంలోకి తీసుకు వెళ్లడానికి రూ.16 నుంచి రూ.27లక్షల విలువ గల యంత్రాలు ఉన్నా యి. wingmastersco.in వెబ్సైట్ ద్వారా వింగ్మాస్టర్స్ కంపెనీ ద్వారా పారామోటరింగ్ నిర్వహించడానికి బుకింగ్ చేసుకుని, సిద్దిపేట జిల్లాలని మర్కూక్లోని పాములపర్తి పారామోటరింగ్ కేంద్రానికి వస్తే పైలట్లు పర్యాటకుడిని మిషన్పై ఆకాశంలోకి తీసుకువెళ్తారు. యంత్రాన్ని పైలట్ పూర్తిగా కంట్రోల్ చేస్తుంటాడు. యాత్రికుడు కేవలం యంత్రంపై కేటాయించిన సీట్లో కూర్చొని ప్రయాణించాల్సి ఉం టుంది. పారామోటరింగ్ రైడింగ్కు వచ్చే కస్టమర్ల కు ఏదైనా ప్రమాదం సం భవిస్తే రూ.40లక్షల ఇ న్సూరెన్స్ కూడా వర్తించేలా వింగ్మాస్టర్స్ సంస్థ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
ఆసక్తి గల వారికి పారామోటరింగ్ రైడింగ్లో శిక్షణ..
దేశంలోనే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్న మొదటి, ఏకైక కంపెనీ వింగ్మాస్టర్స్ కాగా, ఆసక్తి గల వారికి పారామోటరింగ్లో శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద గల పారామోటరింగ్ రైడింగ్ కేంద్రంలో అభయ్సింగ్ రాథోడ్ నేతృత్వంలో ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి వారం నుంచి మార్చి మొదటి రెండు వారాల వరకు శిక్షణ ఇవ్వడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల వారికి అక్టోబర్, మార్చి నెలల మధ్యలో శిక్షణ ఇస్తారు. 15రోజుల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలానికి రూ.1.50 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 20గంటల పాటు రైడింగ్ పూర్తి చేసిన వారికి శిక్షణ సర్టిఫికెట్ను ఇస్తారు. శిక్షణ కోసం మరో 2 ప్రత్యేక మిషన్లు ఉన్నాయి.
ఎత్తు, ఎగిరే సమయాన్ని బట్టి చార్జీలు
పారామోటరింగ్ రైడింగ్కు వచ్చే పర్యాటకుల వద్ద వారు ఎంత ఎత్తుకు, అలాగే ఎంత సమయం ఎగరాలనుకుంటారో దానిని బట్టి వారి వద్ద వింగ్మాస్టర్స్ చార్జ్ చేస్తారు. 5 నిమిషాల పాటు 300ల ఫీట్ల ఎత్తులో కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రాంతంలో ఆకాశంలో విహంగ వీక్షణం చేయాలంటే రూ. 2500 చార్జి చేస్తారు. రూ.4000లకు 10 నిమిషాల పాటు 500ఫీట్ల ఎత్తులో, 15నిమిషాలు 750 ఫీట్ల ఎత్తులో ఎగరాలంటే రూ. 6000, 1000 ఫీట్ల ఎత్తులో 25నిమిషాల పాటు ఆకాశంలో ఎగరాలంటే రూ. 8000 చెల్లించాల్సి ఉంటుంది.
అందాలు ఆస్వాదించా..
మాది హైదరాబాద్, సిద్దిపేట జిల్లా మర్కూక్లోని కొండపోచమ్మ సాగర్ వద్ద పారామోటరింగ్ ఉందని తెలిసింది. పారామోటరింగ్ రైడింగ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నా. అందుకే ఆన్లైన్లో వింగ్మాస్టర్స్ వెబ్సైట్లో టైమ్ బుకింగ్ చేసుకున్నా. వారు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. రైడింగ్కు వెళ్తే ఆకాశంలో విహరించిన అనుభూతిని చెప్పలేనిది. పక్షిలా ఎగిరినట్లు అనిపించింది. కొండపోచమ్మ ప్రాజెక్టు మొత్తం చాలా బాగా అందంగా కనబడింది. చుట్టుపక్కల ఉన్న పంటపొలాలతో ప్రకృతి కూడా చాలా బాగా కనిపించింది.
పర్యాటకుల నుంచి స్పందన..
2016లో వింగ్మాస్టర్స్ సంస్థను జైపూర్లో ప్రారంభించాం. జైపూర్తో పాటు విశాఖపట్నం, రుషికొండ బీచ్ల వద్ద పారామోటరింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. తెలంగాణలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద పారామోటరింగ్ నిర్వహించడానికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో పాటు వరల్డ్ సిటీ హైదరాబాద్ కూడా దగ్గరలో ఉందని ఇక్కడ కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గతేడాది నవంబర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద పారామోటరింగ్ రైడింగ్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా రైడింగ్ చేయాలనుకుంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని ఇక్కడికి వస్తారు. వారిని పైలట్ పర్యవేక్షిస్తూనే వాతావరణం అనుకూలంగా ఉన్న విధంగా రైడింగ్కు తీసుకువెళ్తాం. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 1100 మందికి పైగా మర్కూక్ కొండపోచమ్మ సాగర్ వద్దకు వచ్చి పారామోటరింగ్ నిర్వహించారు. ప్రాజెక్టును ఆకాశం నుంచి పూర్తిస్థాయిలో చూడడంతో పాటు ప్రాజెక్టు పరిసరాల్లోని పచ్చని వాతావరణాన్ని చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు పారామోటరింగ్లో మా వద్ద ముగ్గురు శిక్షణ పొందారు. హైదరాబాద్లోని సైనిక్పురి, ముంబై నుంచి వచ్చి శిక్షణ పొందారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే శిక్షణ పొందవచ్చు. ఇటలీ, ఇంగ్లాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పటిష్టమైన మిషన్లతో పారామోటరింగ్ నిర్వహిస్తున్నాం. కొండపోచమ్మ ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పారామోటరింగ్ చేయడానికి వస్తున్నారు. అందరి నుంచి మంచి స్పందన లభిస్తున్నది. మా వద్ద సుశిక్షితులు, మంచి అనుభవం గల వేదిక, నిఖిల్, హర్ష్, అర్చిత్ పైలట్లు ఉన్నారు. వారు రైడింగ్ వచ్చే వారిని జాగ్రత్తగా ఆకాశంలోకి రైడింగ్ తీసుకువెళ్తారు. 15ఎకరాల స్థలాన్ని 6 ఏండ్ల వరకు లీజుకు తీసుకున్నాం. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తుంటే మరింత ఎక్కువ కాలం ఇక్కడ ఈ కేంద్రాన్ని కొనసాగిస్తామనుకుంటున్నాం.