సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: బడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయం అనుకుంటాం. కానీ, చెత్త సేకరణ, దాని పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిపై ప్రజలకు, అధికారులకు శిక్షణ నిచ్చేందుకు సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత ఏంసీహెచ్ దవాఖానలో ‘స్వచ్ఛ బడి’ని ఏర్పాటు చేశారు. దీనిని నేడు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు.
సిద్దిపేట పట్టణంలోని పాత ఏంసీహెచ్ దవాఖానలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణతో పాటు ఆరోగ్య సమాజ నిర్మాణానికి బెంగళూరు తర్వాత సిద్దిపేటలో అన్ని హంగులతో ప్రప్రథమంగా ఏర్పాటు స్వచ్ఛ బడిని ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు ఇవ్వడం, చెత్తతో సంపదను సృష్టించడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం, వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృత్తులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగు చేయడం వంటి అంశాలపై అన్ని వర్గాలకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ పాఠాలు బోధిస్తారు.
అనంతరం ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు, వ్యాపార వేత్తలు మొత్తంగా 50మందికి ఒకేసారి తరగతులు వినే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ బడిని డాక్టర్ శాంతితో పాటు మున్సిపల్ ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. వ్యర్థాలతో రూపొందించిన ఇటుక, టైల్స్ను ఉపయోగించారు. పాత బొంగులు, సైకిల్ రీమ్లతో స్వచ్ఛ పాఠశాల ప్రహరీని నిర్మించారు.