సిద్దిపేట : సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెల్దే శ్రీనివాస్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అధికారులను తప్పుదోవ పట్టించి పరిహారం పొందడంతో జిల్లా కలెక్టర్ సోమవారం అతడిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న శ్రీకొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ప్రకటించింది.
పరిహారం పొందేందుకు సంబంధం లేని మరో వ్యక్తిని కెనడాలో ఉంటున్న తన కుమారుడు సాయితేజగా బెల్దే శ్రీనివాస్ రావు అధికారులను నిమ్మించాడు. తమ ఫ్యామిలీ ఫొటోలో అతడిని ఫొటో చేర్చి తప్పుదోవ పట్టించి 18 ఏండ్ల కేటగిరిలో తోగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన బెల్దే శ్రీనివాస్ రావు పరిహారం పొందాడు. విషయం కలెక్టర్ దృష్టి్కి వెళ్లడంతో సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డిని విచారణకు ఆదేశించారు. విచారణలో శ్రీనివాస్ రావు అక్రమానికి పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.