ప్రజలను మభ్యపెట్టే వారిపై క్రిమినల్ కేసులు : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, వేగంగా చేపట్టి ఆ వివరాలను తనకు అందించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, ఈడబ్ల్యూడీసీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పర్యవేక్షక, కార్యనిర్వహక ఇంజనీర్లు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లకు ఐడీఓసీలో సమావేశం నిర్వహించి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో డబుల్ బెడ్రూం స్కీమ్ కింద 15,929 ఇండ్లు మంజూరు కాగా 1,386 ఇండ్లు మినహా అన్ని ఇండ్లు పూర్తయ్యాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన వాటికి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో డబుల్ రూంలకు సంబంధించి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ నోడల్ అధికారి వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్లు మండలంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగిన అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ఇది వరకే గృహ ప్రవేశాలు జరిగిన ఇండ్లలో ఎవరు ఉంటున్నారు.. కుటుంబ సభ్యుల సంఖ్య, ఆధార్ వివరాలు, కులం వంటి వివరాలు సేకరించి ఆర్డీవో ద్వారా ఆ వివరాలు తనకు వారంలో అందజేయాలన్నారు. అలాగే అన్ని మౌలిక సదుపాయాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లు, పూర్తి కాబడి మౌలిక సదుపాయాల కల్పన పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూంలకు లబ్ధిదారుల ఎంపిక వచ్చే 3 వారాల్లో పూర్తి చేయాలన్నారు.
మొదటి, రెండు సార్లు లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుల్లో ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తరువాతే మూడో విడుతగా ఫైనల్ లబ్ధిదారుల జాబితాను ప్రచురించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మధ్య దశలో ఉన్న ఇండ్లకు సంబంధించి ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణకు ఒక వారం, మరో వారం క్షేత్ర పరిశీలనకు కేటాయించాలన్నారు. క్షేత్ర పరిశీలన, బిగ్ డేటాతో వడపోత చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆర్డీవోలు ప్రధాన బాధ్యత వహించాలన్నారు. వచ్చే 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. ఇక నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత అధికారుల అందరితో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమగ్ర సమీక్ష ఉంటుందన్నారు. అప్పటికల్లా అధికారులు తమ పరిధిలోని అన్ని డబుల్ బెడ్రూం సైట్లను సందర్శించాలన్నారు.