సిద్దిపేట, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకూ కొనుగోలు చేయడం, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అమలు చేసి యావత్తు దేశం మన రాష్ట్రం వైపు చూసేలా చేసింది. సీఎం కేసీఆర్ రైతు బిడ్డ కావడంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం వైపే వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి చెరువులు, వాగులు, చెక్డ్యాంలు నింపుతుంది. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతా ఆయకట్టు పెరిగింది. బీడు భూములు పచ్చని పొలాలుగా మారాయి. రోహిణి కార్తె ఆరంభమైంది. తొలకరి జల్లు కూడా కురిసింది. రైతులు వానకాలం సాగుకు సమయాత్తం అవుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టు సాయం కింద రైతు బంధును ఎకరాకు రూ.5 వేల చొప్పున జూన్ 15వ తేదీ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రెవెన్యూ భూఖాతాల్లో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి మారిన రైతులందరికీ రైతుబంధు వేయనున్నారు. గతంలో తప్పులు దొర్లినవారు తమ వివరాలను జూన్ 10వ తేదీలోపు తమ వ్యవసాయశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 7,95,161 మంది రైతులకు గాను రూ.879 కోట్లు జమ చేసింది. ప్రస్తుత వానకాలంలో ఈ సంఖ్య మరింతగా పెరునున్నది. జూన్ 10 తర్వాత పూర్తిస్థాయి లెక్కలు తేలనున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు పూర్తి స్థాయి లెక్కలు సిద్ధం చేసేందుకు వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
గత యాసంగిలో రూ. 879 కోట్లు జమ ..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాల వారీగా పార్ట్బీ నుంచి పార్ట్లోకి వచ్చిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రతి రైతుకు రైతుబంధు అందివ్వాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. గత యాసంగిలో సిద్దిపేట జిల్లాలోని 2,84,000 మంది రైతులకు ప్రభుత్వం రూ.314 కోట్లు జమ చేసింది. మెదక్ జిల్లాలో 2,26,161 మంది రైతులకు రూ.197 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 2,85,000 మంది రైతులకు గాను రూ.368 కోట్లు ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత వానకాలానికి ఇంతే మంది రైతులు ఉంటారా..? మరింతగా పెరుగుతారా…? అనే లెక్కల మనకు జూన్ 10 వరకు స్పష్టత రానున్నది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు గాను ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం 2019 వానకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. వరుసగా ఏడో పంటకు రైతు బంధు అందనున్నది. దీంతో రైతులు సాగును సంబురంగా చేపడుతున్నారు. రైతులు గత ఏడాది నుంచి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా రైతు పండించిన పంటకు మంచి మద్దతు ధర లభించి ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ యేడాది సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపుతున్నారు. ఫలితంగా ఎప్పుడూ లేనంతగా వరిసాగు విస్తీర్ణం పెరుగుతున్నది. బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో వరిసాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని మంత్రులకు, అధికారులకు సూచించారు.
ఈ అంశంపై అవగాహన కల్పించాలని చెప్పడంతో ఆ దిశగా అధికారులు సమాయత్తం అవుతున్నారు. వెదజల్లే పద్ధతి వల్ల ఖర్చులు తక్కువ, సమయం ఆదా, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ పద్ధతిలో నీటి వినియోగం కూడా తక్కువనే. ఇప్పటికే జిల్లాలో వానకాలం సాగు అంచనాను అధికారులు సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలో 5,30,576 ఎకరాలు, మెదక్ జిల్లాలో 3,21,650 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 7,40,845 ఎకరాల్లో ప్రస్తుత వానకాలంలో అన్ని రకాల పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. రోహిణి కార్తె ప్రారంభంలోనే శనివారం రాత్రి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు.
రైతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నాం.
జిల్లాలోని రైతుల పూర్తి వివరాలను వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా ఏఈవో, ఏవోలు పూర్తిస్థాయిలో సేకరించి అప్లోడ్ చేశాం. పార్ట్బీ నుంచి పార్ట్ఏ లోకి వచ్చిన రైతుల వివరాలతో పాటు ఇటీవల కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. ఆయా బ్యాంకుల రైతుల ఖాతాల నెంబర్లు మళ్లీ తీసుకుంటున్నాం. జూన్ 10లోపు ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం. జూన్ 15 నుంచి 25 మధ్యన ప్రభుత్వం రైతులకు రైతుబంధు డబ్బులను జమ చేయనున్నది. గత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 2,84,000 మందికి రైతు బంధును వేయడం జరిగింది. ప్రస్తుత వానకాలంలో ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చును.
రైతు ప్రభుత్వం ..
సీఎం కేసీఆర్ రైతుబిడ్డ. స్వయంగా వ్యవసాయం చేసిన బిడ్డ కావడంతోనే ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతుల సంక్షేమానికి వేస్తుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతు బీమా పథకంలో రైతుల్లో ధైర్యం నింపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి చెరువులు కుంటలు నింపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతో పాటు నేరుగా రైతుల ఖాతాల్లోనే ధాన్యం డబ్బులు వేస్తున్నారు. రైతులు ఇవ్వాళ సంతోషంగా వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. జూన్ 15 నుంచి రైతు బంధును ప్రభుత్వం వేస్తుండంతో సీఎం కేసీఆర్కు జిల్లా రైతుల పక్షాన కృతజ్ఞతలు.