సిద్దిపేట టౌన్, మే 30 : సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ లాక్డౌన్ను ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లాక్డౌన్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సీపీ మాట్లాడారు. అనుమతి లేకుండా బయటకు వచ్చే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మెడికల్, అత్యవసర పనిపై బయటకు వెళ్లే వారికి ఇప్పటి వరకు ఆన్లైన్ ఈ పాసులను 4955 జారీ చేశామన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై 3638 ఈ పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. 5086 వాహనాలను జిల్లా వ్యాప్తంగా సీజ్ చేశామన్నారు. నైట్ కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై 5146 కేసులు నమోదు చేశామని తెలిపారు. లాక్డౌన్ను ఆయా డిజిజన్ల ఏసీపీలు పర్యవేక్షించారు.
నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వం లాక్డౌన్ను మరో 10 రోజుల వరకు పొడగించింది. ఈ పది రోజులు ఉదయం 6 నుంచి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపునిచ్చింది. ప్రజలు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు తెచ్చుకునేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం జిల్లా కేంద్రం సంగారెడ్డి కొత్త బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తాల్లో లాక్డౌన్ను డీఎస్పీ బాలాజీ పరిశీలించారు. సడలింపు సమయం దాటిన తర్వాత తిరుగుతున్న వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు తెలుసుకున్నారు. సరైన సమధానం చెప్పలేని వారిపై కేసులు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కొత్త బస్టాండ్ ఎదుట పోలీస్ చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని నిలిపి లాక్డౌన్లో ఎందుకు బయట తిరుగుతున్నారని నిలదీశారు. సబ్ డివిజన్ పరిధిలో కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో లాక్డౌన్ను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం మరో 10 రోజులు వరకు లాక్డౌన్ను పొడగించిందని గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపు తరువాత బయట తిరిగే వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత దుకాణాలు, హోటళ్లు మూసివేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ వెంట పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రమేశ్, శివలింగం, ఎస్సైలు బాలస్వామి, సుభాష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.