గజ్వేల్ అర్బన్, మే 30 : ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ఎల్ఈడీ విద్యుత్ దీపాలు విరజిమ్ముతున్నాయి. ఆర్అండ్ఆర్ కాలనీలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, వేములఘట్, సింగారం తదితర గ్రామాల ప్రజలు ఆర్అండ్ఆర్ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. అంతర్గత మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అన్ని ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఆర్అండ్కాలనీలో 1925 విద్యుత్ స్తంభాలు, 1935 ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నివాస కుటుంబాలకు విద్యుత్ సరఫరా చేయడానికి ఇప్పటివరకు 19 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
విద్యుత్ కాంతులతో మెరుస్తున్న కాలనీ రహదారులు
ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోని రహదారులన్నీ ఎల్ఈడీ వెలుగులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో ముంపు గ్రామాల ప్రజలు నివసించిన గ్రామాల్లో విద్యుత్ దీపాలు, స్తంభాలు దూరదూరంగా ఉండడంతో విద్యుత్ కాంతులుండేవి. ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రతి రహదారి వెంబడి 10 నుంచి 15మీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో కాలనీ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్నది. ఆర్అండ్ఆర్ కాలనీలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో రెట్టింపుగా సేవలు
ప్రస్తుతం ప్రజలు నివాసం ఉన్న ఇండ్ల వరకు మాత్రమే విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న పలు ఇండ్ల వద్ద, ప్రభుత్వం పలువురికి కేటాయించిన ప్లాట్లలో కూడా త్వరలో ఇండ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రాంతాల్లోనూ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం మరో 6 నుంచి 10 ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయడానికి అధికారులు ప్రణాళికలు వేశారు.