ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్
130 పోలింగ్ కేంద్రాలు.. 1,00,678 మంది ఓటర్లు
విధుల్లో 2388 మంది సిబ్బంది
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
43 వార్డులకు గానూ బరిలో 236 మంది అభ్యర్థులు
మే 3న ఓట్ల లెక్కింపు
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 29 : పుర సమరానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట పట్టణంలో మొత్తం 43 వార్డులకు పోలింగ్ జరుగనున్నది. ఇందు కోసం 60 స్థానాల్లో 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,00,678 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 43 వార్డుల్లో 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో సరైన సౌకర్యాలు కల్పిందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా ఉధృతి దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో గురువారం రాత్రి వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకున్నారు.
ఎన్నికల విధుల్లో 2388 మంది సిబ్బంది
మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 43 వార్డుల్లో జరుగుతున్న పోలింగ్కు 236 మంది అభ్యర్థులు పోటీ పడనుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు. 43 వార్డుల్లో మొత్తం 1,00,678 మంది ఓటర్లు ఉండగా, అందులో 49,886 పురుష ఓటర్లు, 50,781 మంది మహిళా ఓటర్లు ఉండగా, 11 మంది ఇతరులు ఉన్నారు. 36 మంది జోనల్, రూట్ ఆఫీసర్లు, 65 మంది ఎంసీసీ, ఎస్సెస్టీ, వీఎస్టీ టీం, 780 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు, ఓపీఓలను నియమించారు. 130 మంది వీడియోగ్రఫీ, వెబ్క్యాస్టింగ్ సిబ్బంది, 116 మంది మెడికల్ సిబ్బంది, 440 మంది పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం 2388మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
465 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
ఎన్నికలు ప్రశాంత వాతారణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఇందుకు గానూ సుమారు 465 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముగ్గురు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 31 మంది ఎస్సైలు, వీరితో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు మొత్తం 415 మంది సిబ్బంది కాగా, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషనల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో కలిపి మొత్తం 465 మంది పోలీసులు మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు.
నో మాస్క్.. నో ఎంట్రీ..
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారు కచ్చితంగా మాస్క్ ధరించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. మాస్క్ లేని వారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు గీసి ఉంచారు.