సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో గోదారమ్మ కొండెక్కి.. ఎండుతున్న పంట చేలను తడిపింది. గోదావరి జలాలు ఇక్కడికి వస్తాయా..? అన్న అనుమానాలను పటాపంచలు చేసింది. కర్షకుల కష్టాలు తీర్చి, భూమికి బరువయ్యేలా పంటలు పండేలా చేసి, మెతుకు సీమను కోనసీమగా మార్చింది. మండుటెండల్లోనూ చెరువులు, వాగులు, చెక్డ్యాంలు నింపి, సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేసింది. హల్దీవాగుకు జీవం పోసి నిజాం సాగర్వరకు, కూడవెల్లి వాగుకు నీటిని మళ్లించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల చెరువుకు నీటిని అందించింది. అటు నల్గొండ జిల్లాకు గోదావరి పరుగులు పెట్టింది. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో సిద్దిపేట జిల్లా నలుదిక్కులా రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని అందించి రైతుల కష్టాలను ఈ ప్రభుత్వం తీర్చింది. సరిగ్గా ఏడాది క్రితం సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్హౌస్ నుంచి మోటర్లు ఆన్ చేయగా, కొండపోచమ్మ రిజర్వాయర్లో గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిరి సంవత్సరం అయ్యింది.
సిద్దిపేట, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్కడో పుట్టిన గోదారమ్మ.. గల గల పరుగులు పెడుతూ.. కొండపోచమ్మ ఒడికి చేరి ఏడాది పూర్తవుతున్నది.. ఎండుతున్న పొలాల గొంతు తడిపి.. రైతన్న ముఖంలో చిరునవ్వు నింపింది. కాళేశ్వర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా రైతాంగానికి సాగునీటి కష్టాలను తీర్చింది. గతేడాది మే 29న సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి, మంత్రి హరీశ్రావుతో కలిసి మర్కూక్ పంప్హౌజ్లో మోటర్లను ఆన్ చేసి కొండపోచమ్మ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్కు గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. గోదావరి జలాలు ఇక్కడికి వస్తా యా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అత్యంత ఎత్తులో ఉన్న కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి నీళ్లు వచ్చి చేరుతుండడంతో పాటు చెరువులు, వాగులు, చెక్డ్యాం లు మండు టెండల్లో పొంగి పొర్లాయి. సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేసింది. హల్దీవాగుకు జీవం పోసి నిజాంసాగర్వరకు, కూడవెల్లి వాగుకు నీటిని మళ్లించి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నర్మాల చెరువుకు నీటిని అందించింది. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని చెరువులు నింపడంతోపాటు, నల్లగొండ జిల్లాకు గోదావరి పరుగులు పెట్టింది. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో సిద్దిపేట జిల్లా నలుదిక్కులా రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని అందించి రైతుల కష్టాలను తీర్చింది.
సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి కష్టాలను తీర్చుతున్నారు. ఇన్నాళ్లు బోరు బావులు, వర్షాలపై పంటలు పండించిన రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఏడాది భూమికి బరువయ్యేలా పంటలు పం డాయి. సాగు ఆయకట్టు ఘణనీయంగా పెరిగింది. వలసపోయిన వారంతా వచ్చి తమ సొంత ఊర్లలో పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల కింద రిజర్వాయర్ల నిర్మాణాలు రికార్డు సమయంలో పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టులతో మెతుకు సీమకు పూర్వవైభవం వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం సైతం నోచుకోని ఉమ్మడి మెదక్ జిల్లాకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్మానేరు) నుంచి సిద్దిపేట జిల్లాకు వచ్చాయి. మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోసేలా డిజైన్ రూపొందించారు.
ఫలితంగా ఉమ్మడి మెదక్ (సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్) జిల్లా సస్యశ్యామలం అవుతున్నది. 318 ఎఫ్ఆర్ఎల్లో ఉన్న రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు, అక్కడి నుంచి శ్రీరంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి నీటిని పంపించడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈలోగా ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా సాగునీటిని అందించారు. తుక్కాపూర్ పంప్హౌజ్ నుంచి ప్రధాన కెనాల్ ద్వారా అక్కారం, మర్కూక్ పంప్హౌజ్ ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఐదు జిల్లాల వరప్రదాయిని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రిభువనగిరి, మేడ్చల్ జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను కొండపోచమ్మ తీర్చనున్నది. ఈ ఐదు జిల్లాల్లో కలిపి మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో సాగునీటిని అందించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మండుటెండల్లో చెరువులు, చెక్డ్యాంలను నింపారు. కొండపోచమ్మ రిజర్వాయర్తో బహుళ ప్రయోజనాలున్నాయి.
నిజాంసాగర్కు జీవం పోసి..
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ వరకు నీటిని అందించి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 6న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో కలిసి సంగారెడ్డి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 18వ తేదీ వరకు హల్దీవాగుకు నీటిని విడుదల చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు, మంజీరా గుండా 90 కి.మీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గొల్లిలింగాల వద్ద నిజాంసాగర్లో గోదావరి జలాలు కలిశాయి. 42 రోజుల్లో 3.4 టీఎంసీల నీటిని హల్దీవాగు నుంచి నిజాంసాగర్ వరకు తరలించారు. వర్గల్ మండలం (సంగారెడ్డి కెనాల్ నుంచి)లో వరుసగా 4 పెద్ద చెరువులు నింపుకొని హల్దీవాగు పైన 32 చెక్డ్యాంలను నింపింది. వీటి లో సిద్దిపేట జిల్లాలో 9 చెక్డ్యాంలు, మెదక్ జిల్లాలో 23 చెక్డ్యాంలు నిండడంతో వాగు పరీవాహక ప్రాంతం పంటలు చేతికందాయి.
కూడవెల్లి వాగు నుంచి ఎగువ మానేరు
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలంలో చేబర్తి పెద్ద చెరువు వద్ద కుడ్లేరు వాగు ప్రారంభం అవుతున్నది. ఇదే వాగును కూడవెల్లి వాగుగా పిలుస్తారు. ఈ వాగుపై మొత్తం 39 చెక్డ్యాం లు ఉన్నాయి. కూడవెల్లి వాగుతో గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంబీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహించి నింపింది. 2.2 టీఎంసీల నీటిని తరలించారు.
కరోనాను లెక్క చేయకుండా..
రైతులకు సాగు నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు, కార్మికులు అగ్గికురిసే ఎండలు, కరోనాను లెక్క చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు. రికార్డు సమయంలో పనులు చేపట్టి నీళ్లను తీసుకువచ్చారు. యాసంగిలో మంచి పంటలు పండాయి. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనబడుతున్నాయి.