చేర్యాల, ఏప్రిల్ 28: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి ఆలయంలో మే 4వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు పలు ఆంక్షలతో భక్తులకు ఆలయంలో దర్శనాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 4వ తేదీ వరకు కేవలం స్వామి వారి లఘు దర్శనం ఉదయం 6 నుంచి రాత్రి 7గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాలు నిలిపివేయడంతో పాటు ధర్మశాలలో బస చేసేందుకు అనుమతి లేదన్నారు. మల్లన్న క్షేత్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రదాయం మేరకు రోజువారీగా స్వామి వారికి నిర్వహించే పూజలతో పాటు నైవేద్య సమర్పణ తదితర వాటిని భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తులు ఆలయవర్గాలకు సహకరించాలని కోరారు. ఆయనతో ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది ఉన్నారు.