రామచంద్రాపురం, ఏప్రిల్28: సైబరాబాద్ పరిధిలో టెలీమెడిసిన్ సేవలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ సోకడం కంటే భయమే మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానాలు, అపోహలు, భయాలను దూరం చేసేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)సహకారంతో పోలీసులు టెలిమెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దవాఖానలో అడ్మిషన్లు ఇతర సలహాలు, సూచనలకు కాల్సెంటర్ ఫోన్ నంబర్ 8045811138కు కాల్ చేసి అనుమానాలు, అపోహలను ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చు. దీనికోసం సీపీ సజ్జనార్ నేతృత్వంలో 20మంది డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ కరోనా విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, అనుమానాలుంటే వెంటనే కాల్సెంటర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎస్సీఎస్సీ హెల్త్కేర్ విభాగం జాయింట్ సెక్రటరీ రాజీవ్మీనన్ పర్యవేక్షణలో టెలీవైద్య సేవలను అందించనున్నామన్నారు. ప్రస్తుతం ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, ఒకట్రెండు రోజుల్లో ఈ సేవలను 24గంటలు నిర్వహించేలా మారుస్తామని తెలిపారు.