సిద్దిపేట, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అసలే వేసవి కాలం.. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ మండుటెండల్లోనూ జిల్లాలోని చెరువులు, చెక్డ్యాంలు, కుంటలు, వాగులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కృషితో గోదావరి జలాలు విడుదల చేయడంతో జిల్లాలోని 102చెరువులు, 85చెక్డ్యాంలు పూర్తిగా నిండగా.. రైతులు మురిసిపోతున్నారు. రేపోమాపో మరిన్ని చెరువులు, చెక్డ్యాంలు నిండనున్నాయి. మండుటెండల్లో చెరువులు, చెక్డ్యాంలు అలుగు పారుతుండడంతో అన్నదాతలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లను ఎండిపోయిన చెరువులకు మళ్లించడంతో తటాకాలు జలకళను సంతరించుకున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని పలు చెరువులు, చెక్డ్యాంలు ప్రస్తుతం గోదావరి జలాలతో పరవళ్లు తొక్కుతున్నాయి.
ఐదు రోజులుగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ తుక్కాపూర్ పంపుహౌస్ల వద్ద ఒక్కో మోటరు నిరంతరంగా నడుస్తున్నాయి. ఒక్కో పంపు రోజుకు 0.25టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నాయి. కొండపోచమ్మ కెనాల్ ద్వారా కూడవెల్లి (కుడ్లేరు) వాగుకు నీటిని అధికారులు విడుదల చేశారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా వెళ్లే కూడవెల్లి వాగుపై మొత్తం 39చెక్డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి మండలాల్లోని 22చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. తొగుట మండలం వెంకట్రావ్పేట వద్ద బ్రిడ్జి మీది నుంచి నీళ్లు ప్రవహిస్తూ వానకాలాన్ని తలపిస్తున్నది. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ వరకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఆరు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతున్నది. సిద్దిపేట నియోజకవర్గంలో 81చెరువులు, 63చెక్డ్యాంలు నిండాయి. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, తొగుట మండలాల్లో 21చెరువులు అలుగు పారుతున్నాయి. ఈ సెగ్మెంట్లో సుమారుగా 6వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. రైతులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల సంబురాలు నిర్వహించుకుంటున్నారు. కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గజ్వేల్ కెనాల్ ద్వారా మిగిలిన కూడవెల్లి చెక్డ్యాంలు నింపడంతో పాటు హల్దీవాగులోకి నీటిని విడుదల చేయనున్నారు.