సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: అన్నం పెట్టిన చేయిని కాపాడుకుంటరా, ఓట్ల కోసం వచ్చి నెత్తి మీద చేయి పెట్టే వాళ్లను కాపాడుతరా ఆలోచించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ నెంబర్ వన్గా ఉన్నామని, కారు గుర్తుకు వేసినప్పుడే హరీశ్రావు, కేసీఆర్కు ఓటు వేసినట్లన్నారు. సిద్దిపేట పట్టణం రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో నీటి గోస ఉండేదని, ఇప్పుడు అది లేదన్నారు. రూ.300 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశామని, ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. సిద్దిపేట పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డుతో పాటు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పటికే బడ్జెట్లో రూ.11,000 కోట్లు పెట్టామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా లేదని మండిపడ్డారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా.? బీడీ కార్మికులకు జీఎస్టీ పెట్టి వారి చాట గుంజుకున్నందుకు ఓటు వేయాలా.? గ్యాస్ ధర పెంచినందుకు ఓటు వేయాల్నా? అని ప్రశ్నించారు. దేశంలో ఏనాడైనా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఒక్క రూపాయి అన్న ఇచ్చిందా? ఇస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని సవాలు విసిరారు. మండు వేసవిలో కూడా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు.
ఆటోవాలా ప్రచారం..
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పట్టణ పరిధిలోని ఆటో కార్మికులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్లను చేసిన తమకు మంత్రి హరీశ్రావుకు, టీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతగా గల్లీగల్లీలో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రగతి నివేదిక అందిస్తూ టీఆర్ఎస్ గెలుపునకు తమ ఉడతా భక్తిగా ఆటో కార్మికులందరం సహాయం చేస్తున్నామన్నారు.
మంత్రి హరీశ్రావు సుడిగాలి పర్యటన
మున్సిపల్ ఎన్నికల్లో భాగం గా ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఉద యం 8, 9, 10, 11, 12, 28, 35, 36వ వార్డుల్లో ప్రచారం చేయగా, మధ్యాహ్నం నుంచి 27, 29, 30, 41, 42, 43 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి వార్డులో మంత్రి హరీశ్రావుకు మహిళలు, ప్రజలు తిలకందిద్ది మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. తమ ఓటు నిరంతరం అందుబాటులో ఉండే టీఆర్ఎస్ పార్టీకే వేస్తామని హామీ ఇచ్చారు.
స్వల్ప ఉద్రిక్తత…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సిద్దిపేట పట్టణంలో విక్టరీ చౌరస్తా నుంచి రమేష్ విగ్రహం వైపు ర్యాలీ జరిగింది. టీఆర్ఎస్ 24వ వార్డు అభ్యర్థికి సంబంధించిన కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసున్నది. దీంతో పోలీసులు వారిని చెదరకొట్టి గొడవను ఆపారు.