పోపులపెట్టే మెడికల్ కిట్టు
ఒక్కో దినుసులో ఒక్కో ఔషధం
సహజవ్యాధి నిరోధకశక్తికి కేరాఫ్ అడ్రస్ కిచెన్
భారతీయ వంటలే భేష్ అంటున్న నిపుణులు
కరోనా వేళ మన ఆహారానికి ప్రాధాన్యం
కడుపునొప్పికి జీలకర్ర, బెల్లం కలిపి ఇచ్చే తల్లులు కరువయ్యారు. మలబద్ధ్దక నివారణ సమస్యకు ఆముదం పట్టే అమ్మలు కనిపించడం లేదు. చిన్నపిల్లలకు సర్ది, దమ్ము రాకుండా ఓమను మెడలోనూ, తమలపాకును నెత్తిపై కట్టే నేర్పరితనం మాయమైంది. దగ్గగానే తులసి, కరక్కాయ రసాలను తాగించే వైద్యం కనిపించకుండా పోయింది. కండరనొప్పులు తగ్గడానికి సీతాఫలం, చింతాకులను దంచికట్టే చికిత్సా విధానం కనుమరుగైంది. నిమిషాల్లో వ్యాధి నయం కావాలనే ఆతృతతో రసాయన మందులను ఉపయోగించడంతో వ్యాధికారక క్రిములను ఎదుర్కొనే సహజ సామర్థ్యం మనలో తగ్గిపోతోందంటున్నారు నిపుణులు. మన ఇంట్లోనే మంచి మందులు ఉన్నాయని, అవి దీర్ఘకాలికంగా వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
చేర్యాల టౌన్, మే25: ప్రస్తుతం ఆహార నియమాల్లో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి. పురాతన వంటలను చాదస్తంగా భావించడంతో క్రమంగా మనిషి శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతోందన్న వాదన వినిపిస్తున్నది. ప్రతీక్షణం లక్షల సంఖ్యలో వ్యాధికారక క్రిములు మన దేహంపై దాడి చేస్తుంటాయని, వాటి నుంచి రక్షించుకోవడానికి సహజ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ వంటి సూక్ష్మజీవులు ఏకధాటిగా దాడిచేయడానికి కారణం వాటి బలం కన్నా మన బలహీనతే ఎక్కువ కావడం. వెనకటి ఆహారాన్ని తినడం మొదలుపెడితే ఈ వ్యాధికారక జీవులను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో వ్యాధి రాకుండా ఉండేందుకు, వైరస్ సోకినా క్షేమంగా బయటపడేందుకు వెనకటి వంటలే శక్తివంతమనే చర్చకు తెరలేచింది.
ఒక్కో దినుసులో ఒక్కో ఔషధం…
మన ఇంటి వంటల్లో వాడే అన్ని పదార్థాలు దేహంలోని వివిధ అవయవాలకు అవసరమైన బలాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుంటాయని నిపుణులు అంటున్నారు.పోపులో వాడే పసుపు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, అల్లం, దాల్చినచెక్క, శొంఠి, కరివేపాకు, కొత్తిమీర, లవంగాలు, యాలకులతో పాటు వేప తులసి, కలబంధ వంటి మొక్కల ద్వితీయ ఉత్పన్నాలు ఆహారానికి రంగు, రుచి, వాసనతో పాటు మానవ దేహానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధి నిరోధక వ్యవస్థ పెరిగేందుకు దోహదపడతాయని నిపుణులు అంటున్నారు.
జీలకర్ర :
నిమోనియా నివారిణిగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు విటమిన్-సి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఉపకరిస్తుంది.
పసుపు:
దీనిలోని కర్క్యుమిన్ అనే రసాయనం వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సహజ పెయిన్కిల్లర్గా, రక్తంలో గ్లూకోజ్, కొవ్వుల స్థాయిని నియంత్రించేందుకు సహకరిస్తుంది. శ్వాసకోశం సవ్యంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
లవంగాలు :
జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి.యాంటీవైరల్,యాంటీ బ్యాక్టీరియల్ పదార్థంగా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
అల్లం :
దీనిలోని జింగోల్స్ అనే రసాయనాలు శ్వాస వ్యవస్థను పటిష్టం చేసి రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి.
ధనియాలు :
ధనియాలు, శొంఠి మరిగించిన మిశ్రమాన్ని ధాన్య కఘృతం అంటారు. దీనిని సేవించడంతో శరీరంలో చల్లదనం ఏర్పడుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణ, జీర్ణశక్తి పెరుగుతాయి.
మెంతులు :
గాలక్టోమన్నన్ అనే యోగకం కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది.ప్రతి 100గ్రాముల మెంతుల్లో 34గ్రాముల ఐరన్ ఉంటుంది. ఫలితంగా రక్త శుద్ధ్దీకరణకు దోహదపడుతుంది.
మిరియాలు :
మసాలాల్లో రాజుగా పరిగణింపబడే ఈ పదార్థంలో ఉండే పెప్పరైన్ అనే రసాయనం జీర్ణవ్యవస్థ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.
యాలకులు :
ఊపిరితిత్తుల్లో గాలిప్రసరణను పెంచి శ్వాసవ్యవస్థకు సహాయపడతాయి.వీటిలో వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆల్కలాయిడ్లు, ప్లవోనాయిడ్లతో పాటూ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, సోడియం వంటి మూలకాలు, బీ1,బీ2,బీ3,బీ6, సీ విటమిన్లు ఉంటాయి.
వెల్లుల్లి:
పాకహర్షంగా పిలుస్తారు. క్యాల్షియం మూలకాన్ని అధికంగా కలిగి ఉంటుంది.మంచి సూక్ష్మజీవి నాశినిగా పనిచేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వు కరగడానికి,రక్తప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
కరోనా జాగ్రత్తలతో ఇతర వ్యాధులు దూరం..
కరోనా మహమ్మారి సమాజాన్ని అతలాకుతలం చేస్తూ మనిషి జీవన విధానాన్ని మరోసారి గుర్తుచేసింది.ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు మనకు తెలియకుండానే అనేక ఇతర జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తున్నాయి. 90శాతం వ్యాధికారకాలు తాగేనీరు, పీల్చేగాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.మాస్కులు పెట్టుకోవడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన నీటిని తాగడం వంటి జాగ్రత్తలతో ఇతర వ్యాధులు రావడం చాలా తగ్గాయి. కరోనాకంటే ముందు సరాసరిన రోజుకు 10 మంది టీబీ రోగులను చూసేవాళ్లం. ప్రస్తుతం చాలా తగ్గింది. – డాక్టర్ రాధాకృష్ణ, చెస్ట్ ఫిజీషియన్,
కొవిడ్ నోడల్ ఆఫీసర్, రాజన్న సిరిసిల్లా జిల్లా
పోపుల పెట్టే వైద్యనిధి..
నిత్యజీవితంలో మనం వాడే వివిధ సుగంధ ద్రవ్యాలకు అనేక ఔషధ లక్షణాలు ఉన్నాయి.వాటిని తిన్నందు వల్లే మన ముందు తరం మనకంటే ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం కరోనా వంటి సూక్ష్మజీవులు మానవజాతిపై చేస్తున్న దాడికి ప్రధాన కారణం సహజ వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడమే.ఆ శక్తిని పొందడానికి భారతీయ వంటల్లో వాడే వివిధ పదార్థాలు ఉపకరిస్తాయి.వ్యాధి నిరోధకశక్తి ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతరం మనం వాడే పదార్థాలు క్రమంగా దానిని పెంచుతాయి. మొక్కల నుంచి వచ్చే ఈ పదార్థాలు ఆయుర్వేద ఔషధాలుగా పరిగణింపబడతాయి.అతి పురాతన వైద్యశాస్త్రంగా పరిగణింపబడుతూ, ఎలాంటి దుష్ప్రభావాలను చూపని మొక్కల మందులపై చర్చ ప్రారంభం కావడం సంతోషదాయకం.
-డాక్టర్ దీపాంజలి,
మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) ప్రభుత్వ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ, ఇటిక్యాల, సిధ్దిపేట జిల్లా