వరి సాగులో రైతులు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. కూలీల కొరత, పెట్టుబడులు తగ్గించుకునేందుకు ఆధునిక పద్ధతుల వైపు దృష్టి సారిస్తున్నారు. వెద, డ్రమ్ సీడర్ పద్ధతుల్లో సాగు చేసి, సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా చీడపీడలు ఉండకపోవడం.. పెట్టుబడి తగ్గి, దిగుబులు పెరుగుతుండడంతో చాలా మంది మొగ్గు చూపుతున్నారు. వెద పద్ధతి ద్వారా సుమారు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల పెట్టుబడి ఖర్చు తక్కువగా అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ సారి మొత్తం వెద పద్ధతిలోనే సాగు చేస్తామని యాసంగిలో సాగు చేసిన రైతులు పేర్కొంటున్నారు. – సిద్దిపేట అర్బన్, మే 25
సిద్దిపేట అర్బన్, మే 25 : సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో రంగనాయకసాగర్ ప్రాజెక్టు పూర్తి కావడంతో కాలువలు, చెరువుల్లోకి సాగు నీరు వస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. అయితే వాతావరణ మార్పులు, కూలీల కొరత, అధిక పెట్టబడి రైతులకు ఒక శాపంలా మారింది. ఈ క్రమంలో వరి వెద సాగు పద్ధతిని అన్నదాతలు అవలంబిస్తున్నారు. పెట్టుబడి తక్కువ, కూలీల కొరత, సాగు కాలం తక్కువగా ఉండడం ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు గతేడాది సిద్దిపేట ప్రాంత రైతులకు వెద వరి సాగుపై పలుమార్లు అవగాహన కల్పించారు. రైతులను క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లి, చూపించారు. సాంప్రదాయ పద్ధతి కంటే వెద పద్ధతితో అనేక లాభాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
వెద జల్లు పద్ధతిలో ఇలా చేయాలి..
వెద పద్ధతి విధానాన్ని అనుసరిస్తూ చాలా మంది రైతులు లాభాలు పొందుతున్నారు. ఈ విధానంలో ముందు నేలను నీటితో తడిపి, ట్రాక్టర్ సహాయంతో దున్నుకోవాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. పొలంలో నాలుగు మూలలు సమానంగా చేసుకోవాలి. సుమారు ఒక ఎకరాకు 20 కేజీల చొప్పున విత్తనాలను నీటిలో నానబెట్టి, మూతులు పగిలిన తర్వాత పొలంలో చల్లుకోవాలి. పొలం మధ్యలో కాలువలు తీస్తే నీరు నిల్వ ఉండకపోవడంతో పాటు తెగుళ్ల సమస్య కూడా ఉండదు. మూడు రోజుల తర్వాత నీరు పెడుతూ, తీస్తూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా రెండు సార్లు చేసిన అనంతరం కలుపు మందును ఇసుకలో కలిపి చల్లుకోవాలి. 18రోజుల తర్వాత మరోసారి కలుపు మందు చల్లుకోవాలి. నాలుగు నెలల్లో పంట కాలం పూర్తయ్యే వరకు విడుతల వారీగా అధికారుల సూచనల మేరకు యూరియా, పొటాష్ చల్లుకోవాలి.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..
వెద జల్లే విధానం ద్వారా పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుంది. కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నారుపోసే అవసరం ఉండదు కాబట్టి సాగు సులువుగా జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 40 నుంచి 50 కిలోల విత్తనాలు వాడితో ఈ విధానంలో ఎకరానికి 12 నుంచి 14 కిలోలు మాత్రమే వినియోగిస్తాం. ఈ విధానంలో తెగుళ్ల సమస్య అధికంగా ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువగా ఉండడంతో పాటు పంట కాలం తక్కువగా ఉంటుంది. నాటు వేసే అవసరం ఉండదు కాబట్టి విత్తనాలు కూడా తక్కవగా అవసరం ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక రైతు ఒక రోజులో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు చల్లుకోవచ్చు. వెద పద్ధతి ద్వారా సుమారు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల పెట్టుబడి ఖర్చు తక్కువగా అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ సారి మొత్తం వెద పద్దతిలోనే సాగు చేస్తామని యాసంగిలో సాగు చేసిన రైతులు తమ అనుభవాలను వివరించారు.
విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులు
సంప్రదాయ పద్ధతిలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారులు వరి వెద పద్ధతిలో సాగు చేసేందుకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వ్యవసాయ సంబంధిత దుకాణాల వద్దకు వచ్చే రైతుల కోసం వారికి అవగాహన కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో సాంప్రదాయ పద్ధతికి, వెద సాగు పద్ధతికి గల తేడాలను, పెట్టుబడిలో వ్యత్యాసాలను పొందుపరిచి రైతులకు అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో మండల వ్యవసాయ అధికారి పరుశరాంరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి వ్యవసాయ సంబంధిత దుకాణాల వద్ద ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
12ఎకరాల్లో సాగు చేశా..
ఎప్పటిలాగా కాకుండా యాసంగిలో వెద జల్లే పద్ధతిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశా. ఇద్దరం కేవలం రెండు రోజుల్లో మొత్తం చల్లాం. ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి తక్కువైంది. వరి చాలా బాగా వచ్చింది. ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి అధికంగా వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ పద్ధతిలో సాగు చేసిన. అనుకున్న దానికంటే మంచి దిగుబడి వచ్చింది. మళ్ల ఇట్లనే చేస్తా.
పూల వెంకట్రెడ్డి, రైతు, ఎల్లుపల్లి
పెట్టుబడి చాలా తగ్గింది..
నాకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో నాలుగు రకాలుగా సాగు చేశాం. శ్రీవరి సాగు, డ్రమ్సీడర్, సాంప్రదాయ పద్ధతితో పాటు వెద జల్లే పద్ధతిలో సాగు చేశాం. మిగతా వాటితో పోలిస్తే 40శాతం పెట్టుబడి తగ్గింది. మిగతా పద్ధతిలో పోలిస్తే నాలుగు, ఐదు క్వింటాళ్లు ఎక్కువ దిగుబడి సాధించాం. చీడపీడల సమస్య కూడా ఎక్కువగా లేదు. పెస్టిసైడ్స్ అసలు వాడలేదు. సంప్రదాయ పద్ధతిలో వేసిన నాటులో 18మంది నాటు వేస్తే వెద పద్ధతిలో నేను ఒక్కన్నే అరగంటలో వేసినా.
కోమటిరెడ్డి విష్ణువర్దన్రెడ్డి, రైతు, ఎల్లుపల్లి
ఈసారి మొత్తం వెద పద్ధతిలోనే..
యాసంగిలో ఒక ఎకరం మాత్రమే వెద పద్ధతిలో సాగు చేసిన. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాం. మిగతా పద్ధతిలో సాగు చేసిన వాటికంటే చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. గత వానాకాలంలో నాటు వేయాలంటే నెలన్నర రోజులు పట్టింది. ఈ సారి నాకు ఉన్న ఐదు ఎకరాల్లో మొత్తం వెద జల్లే పద్ధతిలోనే సాగు చేస్తా. సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 30 కిలోల విత్తనాలు అవసరమైతే.. వెద పద్ధతిలో కేవలం 14 కిలోలు మాత్రమే చల్లిన. వెద పద్ధతితో చాలా మంచి లాభాలు ఉన్నాయి.
నిమ్మ జనార్దన్రెడ్డి, రైతు, ఎన్సాన్పల్లి
వెద పద్ధతితో లాభాలు..
సాధారణ పద్ధతుల కంటే వెద జల్లే పద్ధతితో రైతులకు అనేక లాభాలున్నాయి. పెట్టుబడి తక్కువగా, దిగుబడి అధికంగా ఉంటుంది. చీడ పీడల సమస్య తక్కువగా ఉంటుంది. మంత్రి హరీశ్రావు సూచనల మేరకు ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిని అనుసరించేలా అవగాహన కల్పిస్తున్నాం. గత సీజన్ కంటే ఈసారి ఎక్కువ మంది రైతులు వెద పద్ధతిలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి వ్యవసాయ సంబంధిత దుకాణాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
పరుశరాంరెడ్డి, మండల వ్యవసాయ అధికారి