మారిన పెండ్లి కళ
భారీగా తగ్గిన వివాహ ఖర్చు
ఇదీ ఒకవిధంగా మంచిదే అంటున్న కన్యాదాతలు
గతం గుర్తుకొస్తుందంటున్న వృద్ధులు
పెండ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ.. అని పాడుకునే రోజులకు కరోనా, లాక్డౌన్ దెబ్బకొట్టింది. అసలు ఇప్పుడు పెండ్లి అవసరమా? అనే పరిస్థితికి తెచ్చింది. తప్పని పరిస్థితుల్లో నియంత్రిత పద్ధతుల్లో వివాహాలు జరుపుకోవాల్సి వస్తున్నది. కరోనా నేపథ్యంలో అయ్యవార్లు కూడా మండపానికి రాకుండా ఆన్లైన్లో పెండ్లిండ్లు చేయించేస్తున్నారు.
చేర్యాల టౌన్, మే 22
బాజాభజంత్రీలు.. వేదమంత్రాలు.. బంధువుల పలకరింతలు.. బావ, మరదళ్ల పరాచకాలు.. వదిన, మరదళ్ల వ్యంగాస్ర్తాలు.. ఔరా అనేలా భోజనాలు.. ధూంధాం బరాత్లు.. వివాహంలో తప్పకుండా కనిపించే దృశ్యాలు ఇవి. అయితే ప్రస్తుతం కరోనా వీటన్నిటినీ దూరం చేసింది. తప్పని పరిస్థితుల్లో నియంత్రిత పద్ధతుల్లో వివాహాలు జరుపుకొంటున్నారు. ఫంక్షన్ హాళ్లకు బదులు ఇంటి ముందరే పూలపందిరి వేసి పాత రోజులను గుర్తుచేస్తున్నారు. దగ్గరి బంధువులను మాత్రమే పిలుచుకుని పెండ్లి అయిందనిపిస్తున్నారు.
చేర్యాల టౌన్, మే 22: ప్రపంచాన్ని అన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారి, వివాహాల విషయంలో మాత్రం అనవసర ఆడంబరాలకు అడ్డుకట్ట వేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఒకరిని మించి ఒకరు ఘనంగా పెండ్లి చేయాలనే పోటీకి అడ్డుకట్ట వేసిందనే వాదన వినిపిస్తున్నది. పత్రికలు పంచడం నుంచి పదహారో పండుగ వరకు కుటుంబ సభ్యులు కాలికి బలపం కట్టుకొని తిరగాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య చాలా వరకూ తగ్గిందంటున్నారు వధూవరుల తల్లిదండ్రులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తామెక్కడికి రామని, తమ ఇంటికీ ఎవరూ రావొద్దనే వారే ఎక్కువగా ఉండడంతో వధూవరుల తల్లిదండ్రులు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. దగ్గరి వాళ్లకు సైతం పత్రిక పోస్ట్ చేస్తున్నారు. అవసరమైతే ఓ ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఫంక్షన్హాళ్లకు అనుమతి లేకపోవడంతో ఇంటిముందే పూలపందిరి వేసి పెండ్లి చేస్తున్నారు. ఫలితంగా లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయి. బరాత్లు బంద్ కావడంతో వేల రూపాయలు ఖర్చు తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే కన్యాదానం చేసినప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలని, ఆ విషయంలో మాత్రం బాధనిపిస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో వేదమంత్రాలు..
పెళ్లితంతు నిర్వహించడంలో పురోహితుడి పాత్ర ప్రధానమైంది. లక్ష్మీపూజ, ఐరేండ్ల పూజ, భాషింగాల పూజ, వివాహంతో పాటు చివరకు నాగవల్లి వరకు మంత్రపూర్వకంగా చేయించడం వీరి పని. ఐతే ఒక పురోహితుడు ఒక సీజన్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడంతో జాగ్రత్తలు పెరిగిపోయాయి. ఎక్కువ మంది ఉంటే రాలేమనే వారు కొందరైతే, ఆన్లైన్లో నిర్వహిస్తామనే వారు మరికొందరు. ప్రస్తుత పరిస్థితుల్లో శుభకార్యాలు వాయిదా వేసుకోమంటున్నామని, చాలా వరకు యజమానులు అందుకు సహకరిస్తున్నారని పురోహితులు అంటున్నారు. వీలైతే ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామని, తప్పని పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని హాజరవుతున్నామని పురోహితులు చెబుతున్నారు.
తప్పని వాటికి వెళ్లాల్సివస్తోంది..
పదిహేను నెలలుగా జరుగుతున్న అన్ని శుభకార్యాలను చాలా వరకు ఆన్లైన్లో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. రామకల్యాణాలు, దీపావళి సందర్భంగా జరిగిన కేదారి, సత్య వ్రతాలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాం. చాలాకాలం తర్వాత మంచి ముహూర్తాలున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ఇబ్బందిగానే ఉంది. చాలామంది సాధ్యమైనంత వరకు తమ కార్యాలను వాయిదా వేసుకున్నారు. సంబంధం కుదిరిన తర్వాత ఎక్కువ రోజులు వాయిదా వేయడం కుదరదు. కాబట్టి వివాహాలు మాత్రం నియంత్రిత పద్ధతుల్లో చేయిస్తున్నారు. అలాంటి వాటికి తప్పకుండా వెళ్లాల్సి వస్తున్నది.
-ఎం.చంద్రశేఖర శర్మ, పురోహితులు(సిద్దిపేట జిల్లా)
కారులో నుంచే పెండ్లి
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన సటికం భాగ్య-మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలోని ఓ కల్యాణ మండపంలో గత ఆదివారం జరుగగా, పురోహితుడు డాక్టర్ కోహెడ ప్రసాద్రావు శర్మ మండపం బయట కారులోంచి మంత్రాలు చదువుతూ పెండ్లి చేశారు.
కోహెడ, మే 22:
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి..
ప్రస్తుతం జరుగుతున్న పెండ్లిళ్లు చూస్తుంటే మా చిన్నతనం గుర్తుకొస్తుంది. ఐరేండ్లు, పోలు, బ్యాండుమేళం, పందిరి వేసేవారు. అయ్యవారు ఇలా అన్ని కులవృత్తుల వారి సహకారంతో ఆడి పిల్లను సాగదోలేటోళ్లం. మూడురోజులు.. ఐదురోజులూ అయిన పెండ్లిళ్లు కూడా ఉన్నాయి. తర్వాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. ఏడాదిగా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మా చిన్నతనంలో ఊరు ఊరంతా బంధువులే. అందరొచ్చి ఎంగిలిపడేటోళ్లు. కరోనా వల్ల ఆ ఒక్కటి మాత్రం కనిపిస్తలే. పక్కింటోళ్లను సైతం పిలువలేని పరిస్థితి చూసి బాధనిపిస్తున్నది.
కోరండ్ల సోమమ్మ, లింగాపూర్(సిద్దిపేట జిల్లా)
కరోనా కాలంలో ఖర్చులు తగ్గాయి..
ఊళ్లో ఉన్న అన్ని కులవృత్తుల వారినీ ఏకం చేసే వేడుక పెళ్లి. మా చిన్నతనంలో ఆర్థికానికి బదులు ఆత్మీయతల మధ్య పెండ్ల్లిళ్లు చేసేవాళ్లం. కొంత కాలంగా ఆడంబరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిశ్చితార్థమే పెండ్లిని తలపిస్తున్నది. ఇక పెండ్లి సరేసరి. భోజనాలతో సహా ప్రతీ విషయంలో పోటీ కనిపిస్తున్నది. ప్రస్తుతం కరోనాతో కన్యాదాతలు ఊపిరిపీల్చుకున్నారు. బయటకు చెప్పకపోయినా ఖర్చు విషయంలో మాత్రం వారికి వెసులుబాటు లభించింది.
దుబ్బుడు సుశీల, ధూలిమిట్ట(సిద్దిపేట జిల్లా)